Tirumala: శ్రీవారి సేవలో ప్రముఖ సినీ నటుడు

by Jakkula.Mamatha |

కలియుగ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు.

Tirumala: శ్రీవారి సేవలో ప్రముఖ సినీ నటుడు
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు(సోమవారం) తెల్లవారుజామున సినీ నటుడు సోనూసూద్ తన కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనానంతరం సోనూసూద్ మీడియాతో మాట్లాడుతూ.. 25 ఏళ్ల క్రితం మొదటిసారిగా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నానని గుర్తు చేసుకున్నారు. నేను ఈ రోజు నా కుటుంబంతో క‌లిసి ఇక్కడికి వచ్చానని ఆయన తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించాను. మేము ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నాం. ‘నంది’ అనే పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ కొత్త మూవీలో నటించ‌డంతో పాటు దర్శకత్వం కూడా వ‌హిస్తున్నానని ఆయన తెలిపారు. ఇది త్వరలో ప్రారంభం కాబోతుందని.. స్వామివారి ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చానని నటుడు సోనూసూద్ వెల్లడించారు.

అంతేకాదు.. ఇవాళ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు కూడా దర్శించుకున్నారు. నటుడు శుభలేఖ సుధాకర్, గాయని ఎస్సీ శైలజ దంపతులు, జస్టిస్ దుప్పల వెంకటరమణ, కంట్రోలర్ అడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సంజయ్ మూర్తి వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రం తో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Next Story