- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో పట్టపగలే కుట్ర.. మహిళా ఎమ్మెల్యేపై క్షుద్రపూజలకు యత్నం?
ఆంధ్రప్రదేశ్లో ఇన్నాళ్లు పరస్పర ఆరోపణలతో కొనసాగిన పొలిటికల్ వార్ వ్యక్తిగత కుట్రలపై మళ్లింది.

దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఇన్నాళ్లు పరస్పర ఆరోపణలతో కొనసాగిన పొలిటికల్ వార్ వ్యక్తిగత కుట్రలపై మళ్లింది. తాజాగా, సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి (Bandaru Sravani) నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజల (Black Magic Ritual)కు ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిన్న ఓ కారులో వచ్చిన కొందరు గుర్తు తెలియని దుండగులు అనంతపురం (Anantapur)లోని ఎమ్మెల్యే శ్రావణి ఇంటి ముందుకు వెళ్లి అక్కడి క్షుద్ర పూజల తరహాలో పసుపు రుద్దిన నిమ్మకాయలు, తెల్ల నువ్వులు వేసి వెళ్లారు. ఈ క్రమంలోనే అటుగా వెళ్లిన ఎమ్మెల్యే అనుచరులు గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. అనంతరం దుండగులను పట్టుకోవడానికి కారును వెంబడించినప్పటికీ, అప్పటికే వారు వేగంగా అక్కడి నుంచి తప్పించుకున్నారు.
ఇది తెలిసిన వారి పనే.. ఎమ్మెల్యే ఆవేదన
తాజాగా ఘటనపై ఎమ్మెల్యే బండారు శ్రావణి తీవ్రంగా స్పందించారు. గత కొద్ది రోజులుగా తనపై ఇలాంటి మానసిక వేధింపులు జరుగుతున్నాయని, తనను భయభ్రాంతులకు గురిచేయడానికి ఎవరో తెలిసిన వ్యక్తులే ఈ పనికి పూనుకున్నారని కామెంట్ చేశారు. మూఢ నమ్మకాలతో తనను ఆందోళనకు గురిచేయాలని చూస్తున్నారని ఆమె వాపోయారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎమ్మెల్యే శ్రావణి ఇప్పటికే అనంతపురం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దుండగులు వచ్చిన కారు నంబరు ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది రాజకీయ ప్రత్యర్థుల చేశారా.. లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయి అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగుతోంది.






