అన్నమయ్య డ్యాం దుర్ఘటనకు 18 నెలలు.. పవన్ కల్యాణ్ ఆవేదన

by Mallepaka Hamsa |   (  Updated:2023-05-19 07:04:49  IST  )

ఉమ్మడి వైస్ఆర్ కడప జిల్లాలోని అన్నమయ్య డ్యాం తెగి 33 మంది మరణించిన ఘటనకు 18 నెలలు పూర్తయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు.

అన్నమయ్య డ్యాం దుర్ఘటనకు 18 నెలలు.. పవన్ కల్యాణ్ ఆవేదన
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి వైస్ఆర్ కడప జిల్లాలోని అన్నమయ్య డ్యాం తెగి 33 మంది మరణించిన ఘటనకు 18 నెలలు పూర్తయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. 2021 డిసెంబర్ 11 తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షాలకు ఎన్నడూ రానంత వరద మూడు లక్షల ఇరవై వేల క్యూసెక్కులు రావడంతో సుమారు ఐదు గంటల 30 నిమిషాలకు డ్యాం యొక్క మట్టికట్ట తెగిపోయింది. హఠాత్తుగా సంభవించిన ఈ వరద వలన చేయరు నది ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురుపేట, పులపతూరు మరియు గుండ్లూరు గ్రామాలలోని 33 మంది ప్రజలు జల సమాధి అయ్యారు అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నాము ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారు. మరి ఆ కమిటీ ఏమైందో అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.

హైలెవెల్ కమిటీ సభ్యులు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో , సీఎం వైఎస్ జగన్ ఏ చర్యలు తీసుకున్నారు ఆ దేవుడికే ఎరుక అని పవన్ కల్యాణ్ విమర్శించారు. ‘అన్నమయ్య డ్యామ్ ని తిరిగి పూర్తిస్థాయిలో పునర్నిర్మానం చేసి ఒక ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించారు. దుర్ఘటన జరిగి ఈరోజుతో 18 నెలలు. ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక కనీసం ఈరోజుకి కూడా వీసమెత్తు పనులు చేయలేదు. ఈ 18 నెలలలో సాధించింది ఏమిటయ్యా అంటే అస్మదీయుడు పొంగులేటి కి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని రూ.660 కోట్లకు అప్పచెప్పారు’ అని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. మరోవైపు కేంద్ర జలశక్తి మంత్రి శకావత్ రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారు. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద గనక అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని వాపోయిన అంశాన్ని పవన్ కల్యాణ్ తన ట్విటర్ వేదికగా గుర్తు చేశారు.

Next Story