Supreme Court: హనీమూన్ హత్య కేసు.. సోనమ్ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-23 07:32:03  IST  )

హనీమూన్ మర్డర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

Supreme Court: హనీమూన్ హత్య కేసు.. సోనమ్ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశాన్ని షేక్ చేసిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi)కి సుప్రీంకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు గతంలో మంజూరైన బెయిల్‌ను రద్దు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పు వెలువరించింది. మూడు వారాల్లోగా ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలని నిందితురాలిని ఆదేశించింది. జస్టిస్ ఎంఎం. సుందరేష్, జస్టిస్ పీవీ వరాలేల ద్విసభ్య ధర్మాసనం మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దశలో నిందితురాలు బెయిల్‌పై బయట ఉంటే విచారణ ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ తదుపరి 6 నెలల్లోగా విచారణ పూర్తవ్వకపోతే, ఆమె మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కాగా, ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ, ఆయన భార్య సోనమ్ రఘువంశీ 2025 మే నెలలో హనీమూన్ కోసం మేఘాలయలోని సొహ్రా ప్రాంతానికి వెళ్లారు. అక్కడ మే 23న వారిద్దరూ కనిపించకుండా పోగా, జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం ఒక లోతైన లోయలో లభ్యమైంది. పోలీసుల దర్యాప్తులో సోనమ్ తన ప్రియుడు రాజ్‌కుమార్‌ (Raj Kumar), సుపారీ గ్యాంగ్‌తో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించిన విషయం తెలిసిందే. గతంలో నిందితురాలి అరెస్టు మెమోలో సాంకేతిక లోపాలు ఉన్నాయనే కారణంతో హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, దానిని సవాలు చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ అది కేవలం టైపింగ్ పొరపాటని, అత్యంత తీవ్రమైన హత్య కేసులో అలాంటి సాంకేతిక కారణాలతో బెయిల్ ఇవ్వడం సరికాదని కోర్టుకు తెలిపారు. ఆయన వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఇవాళ నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్‌ను రద్దు చేసింది.

Next Story