Jantar Mantar: విద్యార్థుల పోరాటానికి అగ్రహీరో మద్దతు

by Gantepaka Srikanth |

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నీట్' (NEET) ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థుల ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి.

Jantar Mantar: విద్యార్థుల పోరాటానికి అగ్రహీరో మద్దతు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నీట్' (NEET) ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థుల ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. వివాదాస్పదంగా మారిన ఈ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా విద్యార్థి సంఘాలు, అభ్యర్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు తీవ్ర రూపం దాల్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనను హోరెత్తిస్తున్నారు. ఈనెల 20వ తేదీన జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు తమ నిరసనను మరింత తీవ్రతరం చేయడంతో పోలీసులు అడ్డుకొని లాఠీఛార్జ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న అభ్యర్థులపై పోలీసుల బలప్రయోగం జరగడంతో దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ సినీ, సామాజిక, రాజకీయ ప్రముఖులు వారికి మద్దతుగా నిలుస్తున్నారు.

నేరుగా ఢిల్లీకి వెళ్లి మద్దతు తెలిపిన కథానాయికలు..

విద్యార్థులకు మద్దతుగా దక్షిణ భారత్ నుంచి సినీ తారలు సైతం నేరుగా రంగంలోకి దిగడం విశేషం. తమిళ యంగ్ హీరోయిన్లు ప్రియా ప్రకాష్ వారియర్, గౌరీ జి. కిషన్ స్వయంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు చేరుకుని, ఆందోళన బాటపట్టిన విద్యార్థులను కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. నీట్ లీకేజీతో భవిష్యత్తు కోల్పోతున్న విద్యార్థుల పక్షాన నిలబడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందంటూ స్పష్టం చేశారు.

సోషల్ మీడియా వేదికగా స్పందించిన విజయ్ సేతుపతి..

తాజాగా తమిళ స్టార్ హీరో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కూడా ఈ ఆందోళనకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టిన ఆయన.. న్యాయం కోసం విరామం లేకుండా పోరాడుతున్న విద్యార్థుల ఆవేదనను సమర్థిస్తూ, వారికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయ్ సేతుపతి వ్యాఖ్యలతో నీట్ బాధితుల పోరాటానికి మరింత బలం చేకూరినట్లయింది.

Next Story