కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది ఏపీ వాసుల మృతి: నారా లోకేశ్ విచారం

by Disha Web Desk 21 |
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది ఏపీ వాసుల మృతి: నారా లోకేశ్ విచారం
X

దిశ, డైనమిక్ బ్యూరో : కర్ణాటకలో చిక్ బళ్లాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వలస కూలీలు 13 మంంది మృతి చెందడం కలచివేసిందన్నారు. పొట్టకూటికోసం వలసవెళ్తున్న వారిని మృత్యువు కబళించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని నారా లోకేశ్ కోరారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు నారా లోకేశ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇకపోతే శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన కూలీలు పనుల నిమిత్తం బెంగళూరుకు వలస వెళ్తుంటారు. వలస వెళ్లిన కూలీలు పండుగలకు సొంతూరు వచ్చి తిరి వెళ్తుంటారు. ఇటీవలే దసరా పండుగకు వచ్చిన వలస కూలీలు తిరిగి పనుల నిమిత్తం బెంగళూరుకు బయలుదేరారు. బుధవారం వేకువ జామున సుమోను బాడుగగకు తీసుకుని 15 మంది వలస కూలీలు బెంగళూరుకు బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం కర్ణాటక రాష్ట్రం చిక్ బళ్లాపూర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఆరుగురు, చికిత్సపొందుతూ మరోకరు మృతి చెందారు. మెుత్తం ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. మృతులంతా శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో గోరంట్ల మండలంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Next Story

Most Viewed