ఇక టీఆర్ఎస్‌లో ఉండలేను.. పార్టీ కీలక నేత

by  |
Ande Babaiya
X

దిశ, షాద్‌నగర్: ‘‘టీఆర్ఎస్ పార్టీకి ఏడేండ్లుగా సేవలందించాను. కానీ షాద్‌నగర్ టీఆర్ఎస్ పార్టీలో ఏనాడు ఎమ్మెల్యే నాకు విలువ ఇవ్వలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తనను ఏనాడు ఆహ్వానించలేదు. విలువలేని పార్టీలో ఇమడలేకే టీఆర్ఎస్ పార్టీకి, పదవికి రాజీనామా చేసి ఈటల రాజేందర్ అడుగుజాడల్లోనే వెళ్లాలని నిర్ణయించుకున్నాను.’’ అని టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి అందె బాబయ్య అన్నారు.

శనివారం షాద్‌నగర్ పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలోని దాదాపు 40 లక్షల మంది ముదిరాజ్ బిడ్డల ప్రతినిధిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌ను అన్యాయంగా, అవమానకరమైన రీతిలో పార్టీ నుండి పంపించారని అన్నారు. గత ఏడేళ్లలో టీఆర్ఎఎస్ పార్టీలో నిబద్ధతతో పనిచేశానని, కానీ.. షాద్‌నగర్ టీఆర్ఎస్‌లో మాత్రం తనకు అవమానాలే మిగిలాయని అన్నారు. అధిష్టానం ఏ బాధ్యత అప్పజెప్పినా తన సొంత ఖర్చులతో ఆ కార్యక్రమాలను పూర్తిచేశానని అన్నారు. కొడంగల్ ఎన్నికల బాధ్యత ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గ బాధ్యతలు, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి మహబూబ్‌నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూల్ తదితర ప్రాంతాల్లో సమర్థవంతంగా పార్టీకి కష్టపడి పనిచేశానని బాబయ్య చెప్పారు. కనీసం తనను పార్టీ నుండి బయటకు వెళ్లొద్దని ఏ ఒక్కరూ సంప్రదించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన సమయంలో కేసీఆర్, కేటీఆర్, ఎంపీ బండ ప్రకాష్‌లు పలు సందర్భాల్లో తనతో మాట్లాడటంతో వారిపై గౌరవంతో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు గెలుపునకు కృషి చేశానని అన్నారు. తాను ఏం ఆశించకుండా పైరవీలు చేయకుండా కాంట్రాక్టులు తీసుకోకుండా సొంత ఖర్చులతో పని చేశానని, పార్టీ ప్రతిష్ట కోసం ఒకానొక సందర్భంలో తన సుమారు నాలుగెకరాల పొలం అమ్ముకున్నట్లు బాబయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ ప్రగతి నివేదన సభ’ కోసం సుమారు రూ.30 లక్షలు ఖర్చు చేశానని తెలిపారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తనను ఏ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదని, ఆత్మగౌరవం చంపుకొని ఇక పార్టీలో ఉండలేనని స్పష్టం చేశారు.

గతంలో అనేకసార్లు ఈ విషయాలను అధిష్టానానికి ఫిర్యాదు చేశానని గుర్తుచేశారు. 2018లో ఢిల్లీలో కేసీఆర్‌ను స్వయంగా కలుసుకుని ఎమ్మెల్యే టికెట్ గురించి అడిగానని అయితే పటాన్ చెరువు, షాద్‌నగర్ టికెట్‌లు ముదిరాజులకు ఇస్తానని చెప్పిన కేసీఆర్ తర్వాత మోసం చేశారని, అంతేకాకుండా నామినేటెడ్ పదవిని ఆశించిన తనకు భరోసా ఇచ్చి, ఆ తర్వాత విస్మరించారని అధిష్టానంపై మండిపడ్డారు. పార్టీలో ఈటల రాజేందర్‌తో పాటు తమకు జరుగుతున్న అన్యాయం, అవమానాల తర్వాత ఇక పార్టీలో ఉండలేమనే అసంతృప్తితో టీఆర్ఎస్‌కు రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌ నుండి అసంతృప్తిగానే వెళుతున్నట్లు, ముఖ్యంగా స్థానిక టీఆర్ఎస్ నేతల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాజేందరన్నను నమ్ముకుని ఆయన బాటలో వెళ్తున్నామని ఇక భారమంతా ఆయనదేనని చెప్పారు. బీజేపీలో చేరుతున్న విషయమై ప్రస్తావించగా అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అందె రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed