అనాధలైన చిన్నారులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

by  |
అనాధలైన చిన్నారులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే
X

దిశ, ఇల్లందు: తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన చిన్నారులకు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అండగా నిలిచాడు. వివరాల ప్రకారం.. నియోజకవర్గం ఇల్లందు పట్టణంలోని 17వ వార్డుకు చెందిన బట్టు గణేష్, రావుల స్రవంతి కొంత కాలం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. గణేష్ పట్టణం లో ఫోటో గ్రాఫర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో గణేష్ అనారోగ్యంతో కొన్నిరోజుల క్రితం మరణించడంతో స్రవంతి రెక్కల కష్టం చేస్తూ ఇద్దరు పిల్లలు హరిప్రియ, సుసాన్‌ను పోషిస్తుంది. కానీ విధి వీరి కుటుంబానికి మరోసారి అడ్డం తిరిగింది. అనారోగ్యంతో స్రవంతి కూడా మరణించడంతో ఇద్దరు చిన్నారులు అనాధలయ్యారు.

స్థానికులు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కి చేరవేశారు. దీంతో స్పందించిన మంత్రి ఈ విషయం గురించి వివరాలు తెలుసుకోమని ఎమ్మెల్యేను కోరారు. చిన్నారుల పరిస్థితి చూసి చెలించిపోయిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ వారి పూర్తి బాధ్యతను వారి భుజాల మీద వేసుకోవడంతోపాటు ఇల్లందు పట్టణంలో మంజూరైన 240 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో పిల్లలిద్దరికీ ఒకటి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. విషయం తెలుసుకున్న నియోజక వర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరామర్శించిన వారిలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, ఇల్లందు వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ హరి సింగ్ నాయక్ ,వైస్ చైర్మన్ జానీ పాషా , టీఆర్ఎస్ నాయకులు పరుచూరి వెంకటేశ్వరరావు, గిన్నారపు రాజేష్, అబ్దుల్లా, ఎంటెక్ మహేందర్, పెండ్యాల హరికృష్ణ, గుండా శ్రీకాంత్, సన రాజేష్, ఎల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story