మొద్దు నిద్రలో యంత్రాంగం.. 18 నెలలుగా విధులకు ఉద్యోగి డుమ్మా

by  |
మొద్దు నిద్రలో యంత్రాంగం.. 18 నెలలుగా విధులకు ఉద్యోగి డుమ్మా
X

దిశ, అచ్చంపేట : ఓ ఉద్యోగి గత 18 నెలలుగా విధులకు హాజరు కాకున్నా పై అధికారులు పట్టించుకోవడం లేదు. తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నిర్లక్ష్య ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో గల ఉప్పునుంతల మండల కేంద్రంలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. మిషన్ భగీరథ శాఖలో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్న ఉప్పల నిఖిల్..24/10/2018 విధుల్లో చేరాడు. నాలుగు నెలల ఆరు రోజులు మాత్రమే విధులకు హాజరయ్యాడు. తదుపరి 01/03/2019 నాడు రెండు నెలల సెలవు అనుమతితో వెళ్లినట్లు తెలిసింది.

18 నెలలుగా విధులకు గైర్హాజరు..

మిషన్ భగీరథ ఏఈఓగా విధులు నిర్వహిస్తున్న నిఖిల్ 18 నెలలుగా విధులకు డుమ్మా కొడుతున్న విషయం మండలంలో చర్చనీయాంశమైంది. ఓ ఉద్యోగి ఉన్నత అధికారుల ఆదేశాలు లేకుండా సుమారు ఏడాదిన్నర కాలం డుమ్మా కొడుతూ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో సంబంధిత శాఖలో అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తనను విధులకు హాజరు కావాలని ఉద్యోగి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయినప్పటికీ అతను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై తోటి ఉద్యోగులు ముక్కున వేలేసుకుంటున్నారు.

డీఈ మణిపాల్ వివరణ..

ఉద్యోగి గైర్హాజరు విషయంపై సంబంధిత మిషన్ భగీరథ డీఈ మణిపాల్‌ను ‘దిశ’ మంగళవారం ఫోన్ ద్వారా వివరణ కోరగా.. ఏఈఓ నిఖిల్ విధులకు హాజరు కాని విషయం వాస్తవమేనన్నారు. అతడు విధుల్లో చేరిన రెండు నెలల అనంతరం గత ఏడాది మార్చి 1న రెండు నెలల సెలవు అనుమతితో వెళ్లాడని అన్నారు. ఇప్పటివరకు విధులకు హాజరు కాలేదని ఆయన తెలిపారు. ఏఈఓ విధులకు హాజరు కానీ విషయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.



Next Story

Most Viewed