ఆన్ లైన్ లో సంవత్సరికం

by  |
ఆన్ లైన్ లో సంవత్సరికం
X

దిశ, కరీంనగర్: కరోనా చేస్తున్న కల్లోలం వల్ల వ్యాధి బాధితులే కాదు సాధారణ పౌరులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్త లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో అంతర్జాతీ, అంతర్గత విమానాల రాకపోకలను కూడా కేంద్రం కట్టడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో విదేశాల్లో ఉన్న భారతీయులు స్వదేశానికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. తమ కుటుంబాల్లో నిర్వహించే కార్యక్రమాలను కూడా కళ్లారా చూసుకునే పరిస్థితి లేకుండా చేసింది కరోనా. ప్రత్యక్ష్యంగా ఉండి చేపట్టాల్సిన కార్యక్రమాలను కూడా కొవిడ్-19 చేయకుండా అడ్డుకుంటోన్నది. దీంతో చాలా మంది ఆన్ లైన్ ద్వారా తమ ఇళ్లలో జరిగే కార్యక్రమాల తంతును కానిచ్చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ భగత్ నగర్ కు చెందిన కోడూరి లక్ష్మీనారాయణ గత సంవత్సరం అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం ఆయన మొదటి సంవత్సరికం నిర్వహించాల్సి ఉంది. అయితే ఆయన పెద్ద కుమారుడు సంజీవ్ అమెరికాలోని టెక్సాస్ లో నివాసం ఉంటున్నారు. తండ్రి చనిపోయినప్పుడు హుటాహుటిన కరీంనగర్ చేరుకున్న సంజీవ్ మొదటి సంవత్సరికం కూడా తన చేతుల మీదుగానే చేయాలని భావించారు. కానీ, కరోనా కారణంగా అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిషేధించడంతో సంజీవ్ టెక్సాస్ నుంచి కరీంనగర్ కు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఆనవాయితీ ప్రకారం చేయాల్సిన సంవత్సరికం తంతును ఆపే అవకాశం లేకపోవడంతో వీడియో కాల్ ద్వారా సంజీవ్ టెక్సాస్ నుంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజారులు వీడియో కాల్ ద్వారా కార్యక్రమం గురించి వివరిస్తుంటే సంజీవ్ అక్కడి నుంచే సంవత్సరికం చేశారు. కరీంనగర్ లో ఉన్న ఆయన సోదరుడు సందీప్ ప్రత్యక్షంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తే సంజీవ్ ఆన్ లైన్ లో తండ్రి ఆబ్దికాన్ని చేసుకున్నారు. తప్పని సరిపరిస్థితుల్లో టెక్సాస్ లోనే ఉండిపోవాల్సి రావడంతో వీడియో కాలింగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని కోడూరి సందీప్ వివరించారు.

Next Story

Most Viewed