చైనాపై విచారణకు అమెరికా..!

by  |
Trump
X

వాషింగ్టన్ : కరోనావైరస్‌తో అమెరికా, చైనాల మధ్య ఘర్షణ మరింత ముదురుతోంది. కరోనా వైరస్ వెలుగుచూసిన తర్వాత అక్కడి ప్రజలు ఆ మహమ్మారి కారణంగా పిట్టల్లారాలిపోవడం, అనంతరం, వైరస్ కట్టడి చర్యలపై పూర్తి సమాచారాన్ని అంతర్జాతీయ సమాజానికి సరైన సమయంలో అందించలేదని అగ్రరాజ్యం ఆరోపిస్తున్నది. చైనాకు డబ్ల్యూహెచ్‌ఓ వత్తాసు పలుకుతోందనే ఆగ్రహంతో దానికి నిధులు కూడా నిలిపివేశారు. ఇక ఇప్పుడు చైనాపై అంతర్జాతీయ విచారణ జరపాలనే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే అగ్రరాజ్యానికి చెందిన కీలక సెనేటర్లు అధ్యక్షుడు ట్రంప్‌ను కలసి విచారణకు సంబంధించి కీలక సూచనలు అందించారు. అమెరికా ఒంటరిగా విచారణ చేయడం కాదు.. మిత్ర దేశాలైన దక్షిణ కొరియా, జపాన్, ఐరోపా దేశాలను కలుపుకొని చైనాపై విచారణ జరపాలని సెనెటర్లు సూచించారు. డబ్ల్యూహెచ్‌ఓ నిర్ణయాధికారంపై కూడా దర్యాప్తు జరపాలని సెనెటర్లు అంటున్నారు. ఈ మేరకు రిపబ్లికన్ సెనెటర్ అయిన మాక్రో రూబియో నేతృత్వంలోని బృందం ట్రంప్‌కు గురువారం ఒక లేఖ అందించారు. కరోనా వైరస్‌కు సంబంధించి చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిచిందని.. ఆ వైరస్ మనుసుల నుంచి మనుషులకు వ్యాపించదని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఇంత మంది మరణాలకు కారణమైందని సెనెటర్లు ఆరోపించారు. అమెరికానే ఈ వైరస్ చైనాలో వదిలిందనే వదంతులను కూడా ఆ దేశం పుట్టించిన విషయాన్ని సెనెట్లర్లు ఆ లేఖలో గుర్తు చేశారు. చైనాపై విచారణ చేయాల్సిన బృందంలో ప్రత్యేకంగా ఉన్నత స్థాయి దౌత్వవేత్తలను నియమించాలని.. కరోనా పుట్టుకకు సంబంధించిన అంశాలపై కూలంకషంగా విచారణ జరగాలని వారు కోరారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా అదుపులోనికి రాగానే ఈ విచారణ ప్రారంభం కావాలని వారు సూచించారు. కోవిడ్-19 విషయంలో అంతర్జాతీయ సంస్థలను చైనా ప్రభావితం చేయడంపై కూడా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో కోరారు. మరి దీనిపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో వేచి చూడాలి.

Tags: america, china, dispute, coronavirus, pandemic, procedure, investigation



Next Story

Most Viewed