షాకింగ్ : ఏకంగా ‘గుట్ట’నే మింగేస్తున్న ‘సర్పంచ్’ అనుచరులు

by  |
gutta soil
X

దిశ, పెద్దపల్లి : కబ్జాదారుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. అధికారుల అండదండలతో కొంతమంది భూ బకాసురులు గుట్టను మాయం చేస్తున్నారు. అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులకు పట్టించుకోవడం లేదు. సుమారు 18 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో అంబేద్కర్ సంఘం నాయకులు గుట్ట వద్దకు చేరుకుని తహశీల్దార్‌కు ఫోన్ చేయగా ఉదయం 10 గంటలకు అర్‌ఐను పంపిస్తానని చెప్పగా.. మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఏ ఒక్క అధికారి రాలేదని వారు మండిపడ్డారు. దళితుల నిరసనను పట్టించుకోరా అని అంబేద్కర్ సంఘం నాయకులు ప్రశ్నించారు.

పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని బోడగుట్ట సుమారు 34 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 357 సర్వే నెంబర్‌లో ఉన్న ఈ గుట్ట ప్రస్తుతం 18 ఎకరాలు కబ్జాకు గురైందని అంబేద్కర్ సంఘం నాయకులు ఆరోపించారు. అక్రమంగా మట్టి తవ్వుతున్నారని తెలిసి మీడియా అక్కడికి చేరుకోవడంతో జేసీబీని అక్కడి నుండి తరలించారు. మీడియా సమక్షంలో అధికారులకు ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. సర్పంచ్ శ్వేత ఆధ్వర్యంలో సుమారు రూ. 2 కోట్లకు పైగా మట్టిని అమ్ముకున్నారని ఆరోపించారు.

కబ్జాదారుల పై వెంటనే చర్యలు చేపట్టాలి..

గతంలో ఆర్డీవో, జేసీలకు వినతి పత్రం అందించినా అధికారుల నుంచి స్పందన లేదు. 34 ఎకరాలు ఉన్న బోడగుట్ట సుమారు 18 ఎకరాలు కబ్జాకు గురైందని అధికారులకు చెబితే.. కబ్జా చేస్తున్న వారి నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అంబేద్కర్ సంఘం నాయకుడు తాండ్ర అంజయ్య వాపోయారు. గుట్టచుట్టూ హద్దులు గుర్తించాలని తహశీల్దార్‌కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. గత ఏడాదిన్నర కాలంగా పోరాటం చేస్తున్నా ఎమ్మార్వో ఒక్కసారి కూడా గుట్టను పరిశీలించలేదు. నిరసన కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు అంజయ్య, సుమన్, స్వామి, సురేష్ అనిల్, మహేష్, సాగర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

-తాండ్ర అంజయ్య, అంబేద్కర్ సంఘం నాయకుడు

Next Story

Most Viewed