అంబటి రాంబాబుకు భారీ షాక్.. ఈసారి కూడా మంత్రి పదవి డౌటే?

by  |
అంబటి రాంబాబుకు భారీ షాక్.. ఈసారి కూడా మంత్రి పదవి డౌటే?
X

దిశ, ఏపీ బ్యూరో: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేం. అదృష్టం కలిసొస్తే ఒక్కోసారి ఊహించిన స్థాయికి వెళ్లిపోవచ్చు.. అదే దురదృష్టం వెంటాడితే అధో:పాతాళానికి పడిపోవచ్చు. ఇవి నిత్యం రాజకీయాల్లో మనం చూస్తూనే ఉన్నాం. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తులకు పదవులు వస్తుందనుకునే సమయంలో ఏదో ఒక వివాదం వెంటాడి అతడి రాజకీయ జీవితాన్ని ఇబ్బందుల్లో పడేసిన పరిస్థితులు కోకొల్లలు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎదురైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు ఈ గడ్డు పరిస్థితి ఎదురైంది.

వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు..

అంబటి రాంబాబుకు వైఎస్ కుటుంబంతో విడదీయలేని అనుబంధం ఉంది. వైఎస్ హయాంలో ఏపీఐఐసీ చైర్మన్‌గా అంబటి రాంబాబు పనిచేశారు. వైఎస్ మరణానంతరం వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాటి నుంచి ఇప్పటి వరకు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లినప్పటికీ వైసీపీని వీడలేదు. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ బలంగా వినిపించడంలో ముందుండేవారు. వైఎస్ జగన్‌పై గానీ..వైఎస్ఆర్ కుటుంబంపై ఎవరు ఎలాంటి కామెంట్లు చేసినా ధీటుగా జవాబిచ్చేవారు. ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్ కుటుంబంపై ఈగ వాలినా అంగీకరించేవారు కాదు. అందుకే వైఎస్ కుటుంబానికి అంబటి అన్నా కూడా చాలా అభిమానం.

2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. అయితే జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరిగినప్పటికీ వివిధ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు నిరాశే మిగిలింది. రెండున్నరేళ్లకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం నాడే చెప్పారు. మరో నాలుగు నెలల్లో విస్తరణ కూడా జరగబోతుంది. ఈసారి అంబటి లాంటి సీనియర్ నాయకులకు బెర్త్ కన్ఫమ్ అని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో అంబటి రాంబాబును వివాదాలు వెంటాడుతుండటం ఆయన అనుచరుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయాల్లో ఎంత దూకుడుగా ఉంటారో..అంతే తీవ్రత ఉన్న వివాదాల్లో ఇరుక్కుంటారు అంబటి రాంబాబు. దీంతో అంబటి రాంబాబుకు జగన్ కేబినెట్‌లో బెర్త్‌పై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మహిళలతో రాసలీలల ఆడియోలు..

2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా కొనసాగుతున్న సమయంలో అంబటి రాంబాబు..సంజన అనే మహిళతో మాట్లాడుతున్న ఆడియో ఒకటి సంచలనం సృష్టించింది. అంబటి రాంబాబు సంజన అనే మహిళతో సంభాషణలు పెద్ద దుమారాన్నే రేపాయి. మీడియా చానెల్స్ అయితే ఓ రేంజ్‌లో ఆడుకున్నాయి. అయితే దానిపై అంబటి రాంబాబు పెద్ద పోరాటం చేశారు. దీంతో అదంతా వట్టిదేనని తేలింది. దీంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. సరిగ్గా పదేళ్ల తర్వాత త్వరలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్న తరుణంలో అంబటి రాంబాబు…సుకన్య అనే మహిళతో రాసలీలల ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుకన్య అనే మహిళతో బాడీ మసాజ్‌తోపాటు అన్నీ చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

వెంటాడుతున్న వరుస వివాదాలు..

ఎమ్మెల్యే అంబటి రాంబాబు వరుస వివాదాల్లో ఇరుక్కుంటూనే ఉన్నారు. గతంలో సంజన ఆడియో లీక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. ఆ తర్వాత ఇటీవలే కాపు సామాజిక వర్గంపై అంబటి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. రాజకీయ జీవితంలో ఏనాడు క్షమాపణలు చెప్పని అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో తన సొంత సామాజికవర్గంపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. కాపులు తెలివి తక్కువవాళ్లు, ఆవేశపరులు, మాంసం ఎక్కువగా తింటారు, మద్యం బాగా తాగుతారు. ఇవన్నీ మిగతా కమ్యూనిటీల్లో ఉన్నా.. కాపుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయంటూ కామెంట్స్ చేశారు. దీనిపై మీరేమైనా సర్వే చేశారా అని యాంకర్‌ ప్రశ్నించగా దీనికి సర్వే అవసరం లేదు. కాపులు తెలివి తక్కువవాళ్లే అంటూ వ్యాఖ్యాలు చేశారు. దీనిపై తన కులస్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. దీంతో అంబటి రాంబాబు దిగొచ్చారు. భేషరతుగా క్షమాపణలు కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ ఘటన మరువకముందే తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతిపైనా అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. లక్ష్మీపార్వతి సొంతూరు గుంటూరు జిల్లా సత్తెనపల్లి లోని ధూళిపాళ్ల. ఆ గ్రామంలో ఆమెకు రెండెకరాల భూమి ఉంది. ఆ భూమిని స్థానికంగా ఉండే బీజేపీ నేత కోటేశ్వరరావు కౌలుకు వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఆ భూమిలో ‘జలకళ పథకం’ కింద ఉచితంగా బోర్ వేయించమని స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబును కోరగా నిరాకరించారట. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి అంబటి రాంబాబుకు ఫోన్‌ చేయగా దురుసుగా మాట్లాడారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ ఘటన మరువకముందే తాజాగా సుకన్యతో మాట్లాడినట్లు ఆడియో లీక్ అవ్వడం దుమారానికి కారణమైంది.

నాపై కుట్ర జరుగుతుంది..

తనపై కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. తనను ప్రజల దృష్టిలో తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగానే ఈ వాయిస్ అని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆడియోలో వాయిస్ తనది కాదన్నారు. ఇలాంటి వాయిస్‌లు ఎలా సృష్టిస్తున్నారో తనకు తెలియడం లేదన్నారు. గతంలో పదేళ్ల క్రితం తనపై ఇదేరీతిన ఒక ఇష్యూ వచ్చిందని దాన్ని కూడా ఎదుర్కొన్నట్లు తెలిపారు. అది కూడా తప్పుడు ప్రచారమని తేలిందని.. ఇది కూడా కొందరి కుట్ర అని తొందర్లోనే నిరూపిస్తానని ఆయన తెలిపారు. ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మెుద్దని రాంబాబు కోరారు. కుట్రలు చేసి ఇరికించాలని చూస్తున్నారు. అదరను-బెదరను. నిజాయితీగా ఎదుర్కొంటాను. నిజాలను బయటకు తీస్తానని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు.

సొంతపార్టీ నేతలా లేక ప్రతిపక్షాల కుట్రనా?

ఈ ఆడియో లీకుల వెనుక ప్రతిపక్షాలే ఉన్నాయా…? లేక ఆయనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకు ఇతరులు ఎవరైనా ప్రయత్నిస్తున్నారా అన్న దానిపై వైసీపీ నాయకత్వం దృష్టి సారిస్తోంది. గుంటూరు జిల్లా నుంచి జగన్ కేబినెట్ లో బెర్త్ ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. బెర్త్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అంబటికి మంత్రి పదవి రాకుండా సొంత పార్టీ నేతలు ఎవరైనా ఇలా చేశారా అన్న కోణంలో కూడా పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతుంది.

అప్పుడు బయటపడ్డారు.. మరి ఇప్పుడు

ఏపీ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణపై జోరుగా చర్చ జరుగుతుంది. ఎవరికి బెర్త్ కన్ఫమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేదానిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల భారీగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం, మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవులు కట్టబెట్టడంతో కొంతమంది ఆశావాహులు మెత్తబడ్డారు. ఇదే సమయంలో మంత్రి పదవుల రేసులో ఉన్నవారిలో అంబటి రాంబాబు మెుదటి వరుసలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆడియో లీక్ కలకలం రేపుతోంది. పదేళ్ల క్రితం ఘటన నుంచి బయటపడ్డ అంబటి రాంబాబు ఈ రెండో ఘటన నుంచి ఎలా బయటపడతారనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే వాస్తవాలు బయటకు తీస్తానని చెప్పిన అంబటి రాంబాబు ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. పోలీసులకు ఫిర్యాదు చేసి వాయిస్‌పై విచారణ కోరితే అసలు గుట్టు రట్టవుతుంది. లేని పక్షంలో మంత్రి పదవి చేజారినట్టేనని తెలుస్తోంది.


Next Story