ఆత్మహత్య చేసుకుంటా అనుమతివ్వండి

by  |
ఆత్మహత్య చేసుకుంటా అనుమతివ్వండి
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం :
సింగ‌రేణి సంస్థ చేసిన మోసానికి నిర‌స‌న‌గా ఆత్మ‌హ‌త్య చేసు కోవాల‌నకుంటున్నాన‌ని, అందుకు అనుమ‌తివ్వాల‌ని కోరుతూ రాష్ట్ర‌ప్ర‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు, పీఎం మోడీకి , సీఎం కేసీఆర్‌కు ఇల్లందు‌కు చెందిన ఇస్లావత్ దిలీప్ కుమార్ అనే యువ‌కుడు వీడియో ద్వారా విన్న‌వించాడు. ఓపెన్ కాస్టుల కోసం భూములు తీసుకున్న సింగ‌రేణి సంస్థ‌, ఒప్పందం ప్ర‌కారం ఉద్యోగాలివ్వ‌కుండా మోసం చేస్తోంద‌ని ఆయన ఆరోపించాడు. చాలా కాలంగా సింగ‌రేణితో పోరాడి అల‌సిపోయామ‌ని ఆయన ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. గ‌త కొన్ని నెల‌లుగా సింగ‌రేణి, ప్ర‌భుత్వ పాల‌కుల చుట్టూ తిరుగుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. వీడియోలో దిలీప్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆరు సంవత్సరాల క్రితం ఇల్లందులో ఓపెన్ కాస్ట్ నిమిత్తం ఆ ప్రాంత గిరిజనుల నుంచి భూముల‌ను సింగ‌రేణి సంస్థ తీసుకుంది. భూ సేక‌ర‌ణ స‌మ‌యంలో ప‌రిహారంతో పాటు బాధిత కుటుంబాల‌కు ఉద్యోగాలిస్తామ‌ని సింగరేణి చెప్పింది. బాధితుల‌కు న్యాయం చేయకపోవడంతో విషయం కోర్టుకు చేరింది. జీవో నెంబ‌ర్ 34 ప్ర‌కారం భూ నిర్వాసితులకు సింగరేణి యాజమాన్యం ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. కాగా కోర్టు ఆదేశాల‌ను సింగ‌రేణి సంస్థ అమ‌లు చేయ‌కపోవడం, భూములు కోల్పోవడంతో తాము బతుకు తెరువు కోల్పోతుండటంతో ఆయన ఆవేదనకు గురయ్యాడు.

కాగా సింగ‌రేణి సంస్థ చేస్తున్న మోసానికి నిర‌స‌న‌గా తాను ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని భావిస్తున్నాని, అందుకు అనుమ‌తివ్వాల‌ని కోరుతూ వీడియోలో ఆయన పేర్కొన్నాడు. ఇదే విష‌యమై గ‌తంలో రాష్ట్ర‌ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తోపాటు జాతీయ ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ల దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు చెప్పాడు.



Next Story

Most Viewed