కర్ఫ్యూలోనూ బస్సులు, ట్రక్కులు తిరగొచ్చు: కేంద్రం

by  |
కర్ఫ్యూలోనూ బస్సులు, ట్రక్కులు తిరగొచ్చు: కేంద్రం
X

న్యూఢిల్లీ: రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు అమలవుతున్న కర్ఫ్యూ కాలంలోనూ బస్సులు, ట్రక్కులు తిరగొచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, రాత్రిపూట వ్యక్తులను ప్రయాణించకుండా నిరోధించింది కేవలం వారు ఒక చోట గుమికాకుండా ఉండేందుకేనని, భౌతిక దూరం భగ్నం కావొచ్చనే ఉద్దేశంతోనే కర్ఫ్యూ విధించామని కేంద్ర హోం వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు. కర్ఫ్యూ ప్రధాన లక్ష్యం రాత్రిపూట ప్రజలు గుమికాకుండా నిరోధించడానికేనని వివరించారు. అందుకే సప్లై చైన్‌, లాజిస్టిక్‌లో భాగంగా ప్రయాణించే ట్రక్కులు, ఇతర వాహనాలు, అలాగే, ప్రయాణికులను తరలిస్తున్న బస్సులనూ అడ్డుకోవద్దని ఆయన రాష్ట్రాలకు లేఖ రాశారు. కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు హైవేలపై వెళ్తున్న ప్రయాణికులను అడ్డుకుంటున్నట్టు గుర్తించామని, కాబట్టే ఈ స్పష్టత ఇస్తున్నట్టు వివరించారు. ప్రయాణికులను తరలిస్తున్న బస్సులు, ట్రక్కులు, సరుకులను సరఫరా చేస్తున్న వాహనాలను అడ్డుకోరాదని పేర్కొన్నారు. అలాగే, బస్సులు, ట్రైన్‌లు, విమానాల నుంచి దిగిన తర్వాత ఇళ్లల్లోకి వెళ్తున్నవారినీ ఆపొద్దని తెలిపారు.



Next Story

Most Viewed