ప్రాసెసింగ్ రుసుముపై ఫోన్‌పే స్పష్టత!

by  |
ప్రాసెసింగ్ రుసుముపై ఫోన్‌పే స్పష్టత!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫొన్‌పే ఇటీవల పలు సేవలపై ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, చెల్లింపుల యాప్‌లో యూపీఐ నగదు బదిలీ, వ్యాలెట్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసే ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ చెల్లింపులన్నీ ఉచితంగానే కొనసాగుతాయని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ లావాదేవీలకు ఫోన్‌పే ఎలాంటి ఛార్జీలు విధించదని, భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది. అయితే, మొబైల్ రీఛార్జ్‌ల కోసం ఫోన్‌పే ఒక ప్రయోగాన్ని అమలు చేసింది. రూ. 51-100 మధ్య రీఛార్జీలకు రూ. 1, రూ. 100 కంటే ఎక్కువ రీఛార్జీల కోసం రూ. 2 ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేస్తున్నామని కంపెనీ తెలిపింది.

ఈ ఛార్జీలు అన్ని రకాలైన యూపీఐ, వ్యాలెట్, క్రెడిట్, డెబిట్ కార్డ్ వినియోగదారులకు వర్తిస్తుంది. రూ. 50 కంటే తక్కువ రీఛార్జీలకు మాత్రం పూర్తిగా ఉచితమని కంపెనీ పేర్కొంది. ఇక, బిల్లుల చెల్లింపుల కోసం ఫోన్‌పే క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై రుసుమును వసూలు చేస్తుంది. ఇది పరిశ్రమ నిబంధన. ఇది అన్ని చెల్లింపు యాప్‌లు, బిల్ ప్లాట్‌ఫామ్‌లకు సాధారణమని కంపెనీ వివరించింది. ఇటీవల తాము ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జీలకు రూ. 50 వరకు ఖచ్చితమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించాము. దీని ప్రకారం.. ఫోన్‌పే యాప్ నుంచి రూ. 51 కంటే ఎక్కువ మొత్తంలో మూడు ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్‌లను పూర్తి చేసిన వారికి ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ కారణంగానే మొబైల్ రీఛార్జ్‌లపై ప్రాసెసింగ్ రుసుమును విధిస్తోంది.


Next Story