అరకు ప్రమాదం.. మృతులందరిదీ ఒకే కుటుంబం

by  |
Araku road accident
X

దిశ, క్రైమ్ బ్యూరో: విశాఖ అరుకు బస్సు ప్రమాదానికి గురైన బాధితులంతా హైదరాబాద్ నగరానికి చెందిన షేక్ పేట్ సీతానగర్‌కు చెందిన వారని స్థానిక అధికారులు గుర్తించారు. విశాఖ అరకుతో పాటు పలు ప్రాంతాలను పర్యటించేందుకు ఈ నెల 10వ తేదీన తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సీతానగర్ నుంచి బయలుదేరారు. వీరంతా కొట్టం ఇంటి పేరు కలిగిన ఐదుగురు అన్నదమ్ములకు చెందిన కుటుంబ సభ్యులు కావడం గమనార్హం. కాగా, ఈ పర్యటనలో నలుగురు అన్నదమ్ములు ఉండగా, ఒకరు మాత్రం వ్యక్తిగత కారణాలతో వెళ్లలేదు. ఈ ప్రమాదంలో మరణించిన నలుగురు సభ్యులు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

ఘటన సమాచారం తెలియగానే రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ తన సిబ్బందిని బాధిత కుటుంబం వద్దకు వెళ్ళి సమాచారం అందించారు. ఇదే క్రమంలో పర్యటనకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యుల నుంచి సేకరించారు. సమాచారం తెలుసుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. వెంటనే కుటుంబ సభ్యులు తమను విశాఖ వెళ్తామని చెప్పగానే.. వారికి శనివారం పొద్దున్నే 5 గంటల విమానానికి ఎమ్మెల్యే గోపినాథ్ టికెట్‌లను బుక్ చేశారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్, సికింద్రాబాద్, ఆర్డీవో వసంతకుమారి, షేక్ పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి కూడా శనివారం ఉదయం 5 గంటలకు వైజాగ్ వెళ్లనున్నారు.


Next Story

Most Viewed