వలస కార్మికుల కొరత తప్పదా!?

by  |
వలస కార్మికుల కొరత తప్పదా!?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన వెంటనే లక్షలాది మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు కాలినడకనే బయలుదేరారు. మానవాళి చరిత్రలో ఈ స్థాయిలో కార్మికులు పనులు వదిలిపెట్టి ఇంటిబాట పట్టడం తొలిసారి. వీరిలో చాలామంది భార్యాపిల్లల్ని తీసుకుని నడక సాగించిన వారైతే, మరికొందరు సైకిలుపైన, చిన్న చిన్న ద్విచక్ర వాహనాల్లోను వందల కిలోమీటర్లు ప్రయాణం సాగించారు.

బాధపడాల్సిన విషయమేంటంటే..దూరాన్ని, శరీర శక్తిని లెక్కచేయకుండా తరలి వెళ్లిన వలస కార్మికుల్లో ఏఏసాన్య రాష్ట్రాలకు చెందిన వారే అత్యధికులని ఆల్ ఇండియా మాన్యుఫాక్చరర్స్ ఆర్గనైజేషన్(ఏఐఎమ్‌వో) నివేదిక విడుదల చేసింది. కరోనా మహమ్మారి కారణంగా స్వస్థాలకు వెళ్లిన కార్మికులు తిరిగి పని చేసిన ప్రాంతాలకు వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదని నివేదిక స్పష్టం చేసింది. లాక్‌డౌన్ తర్వాత ఏర్పడ్డ పరిస్థితులే దీనికి కారణమని ఏఐఎమ్‌వో అధ్యయనంలో పేర్కొంది. ఇటీవల కరోనా ప్రభావం ఈశాన్య రాష్ట్రల కార్మికులపై ఎంతమేరకు ఉందనే అంశం మీద అధ్యయనం సాగించింది.

అయితే, లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా ఉన్న కారణంగా ఇంకా చాలామంది ఈశాన్య రాష్ట్ర వలస కార్మికులు పనిచేస్తున్న ప్రాంతాల్లోనే ఆగిపోయారని, లాక్‌డౌన్ ఎత్తేయడమో, సడలించడమో జరిగితే వారంతా సొంత ఊళ్లకు పయనమవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఒకవేళ ఇది వాస్తవంగా జరిగితే రానున్న రోజుల్లో దేశంలోని ప్రధాన నగరాలతో పాటు, పట్టణ ప్రాంతాల్లో కార్మికుల కొరత విపరీతంగా ఉండొచ్చని ఏఐఎమ్‌వో అధ్యయనం చెబుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికుల్లో ఎక్కువమంది ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన వారేనని, వీరంతా ప్రధానంగా సరఫరా అయ్యే ఆహారం, తేయాకు, కాఫీ, పానీయాలు, బ్యూటీ, సెలూన్లు, ప్రైవేట్ భద్రత, నర్సింగ్ వంటి కీలక మానవ వనరులు అవసరమైన రంగాల్లో పని చేస్తున్నారని ఈ అధ్యయనంలో తేలింది. ఆయా రంగాల ఆదాయం, రాబడిలో వీరి పాత్ర అధికమని అధ్యయనం స్పష్టం చేసింది.

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కార్మికుల కోసం చేయాల్సిన స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక సాయంపై ఏఐఎమ్‌వో పలు కీలకమైన సూచనలు అందించింది. పనుల్లేని కారణంగా వేతన బకాయిలను ఇప్పించే నిర్ణయాలతో పాటుగా వారికి అత్యవసరమైన ఆహారం, ఉండటానికి వసతి ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. కేంద్ర చొరవ తీసుకుని ప్రతి రాష్ట్రంలోనూ వలస కార్మికుల జాబితాను, గణాంకాల నమోదు జరగాలి. వీరంతా పనులు కోల్పోయిన కారణంగా అందరికీ నగదు ప్రోత్సాహకం వంటి సాయమివ్వాలి. వలస కార్మికులందరూ ఎటువంటి భరోసా లేకుండా సొంత ఊళ్లకే పరిమితమైతే ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, పూణె, బెంగళూరు, చండీగఢ్, సూరత్ వంటి ప్రధాన నగరాల్లో ప్రభావం అధికంగా ఉంటుందని ఏఐఎమ్‌వో నివేదిక చెబుతోంది. ఈ పరిణామాలు ఎదురైతే సూక్ష్మ, చిన్న మధ్య తరహా సంస్థలకు ముప్పు తప్పదని తెలుస్తోంది. వీటన్నిటిని తప్పించేందుకు వలస కార్మికులందరికీ నిరుద్యోగ బీమా కింద కేంద్రం ఆదుకోవాలి. ఈ చొరవ వల్ల ఉద్యోగం లేకపోయిన ఆకలి ఉండదనే మద్దతు, భరోసా దొరుకుతుంది. ఈ నిర్ణయాల వల్ల దీర్ఘకాలికంగా పరిష్కారం లభిస్తుంది అని ఏఐఎంవో అధ్యయనం వివరించింది.

Tags: Migrant Labours, aimo, labours, migrants, shortage of labour

Next Story

Most Viewed