కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తిన ఎర్రసైన్యం

by  |
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తిన ఎర్రసైన్యం
X

దిశ, నర్సంపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిలభారత కార్మిక సంఘాల సమాఖ్య (న్యూ), తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. నర్సంపేటలోని పాకాల సెంటర్, వరంగల్ క్రాస్ రోడ్డు మీదుగా వాసవి కళ్యాణ మండపం వరకు.. కార్మికులు, రైతుకూలీలు, అరుణోదయ కళాకారులు కోలాటం డప్పు చప్పుళ్ల నడుమ భారీ ర్యాలీ చేపట్టారు. వాసవి కళ్యాణ మండపంలో జరిగిన రాష్ట్ర సదస్సుకు కామ్రేడ్ ఈర్ల పైడి, ఓల్లాల కిషోర్‌, గంగుల నరసయ్య, పల్లె బోయిన స్వామిలు అధ్యక్షత వహించారు. ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా ఏఏఐకేఎంకేఎస్ జాతీయ కో కన్వీనర్ కామ్రేడ్ సింహాద్రి ఝాన్సీ, ఏఐఎఫ్‌టీయూ నూతన జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ గుర్రం విజయ్ కుమార్, ఏఐకేఎంకేఎస్ జాతీయ నాయకులు కామ్రేడ్ ప్రసాద్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. దశాబ్దాల పోరాట ఫలితంగా కార్మికులు సాధించుకున్న కనీస హక్కులను కూడా కేంద్రంలోని బీజేపీ పాలకులు హరిస్తున్నారని ఆరోపించారు. కార్మికుల గొంతును నొక్కేస్తుస్తున్నారని, వారిని ప్రాణమున్న యంత్రాలుగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రామిక ప్రజానీకం చెమట, నెత్తురును చిందించి అభివృద్ది చేసిన బ్యాంకులు, ఎల్ఐసీ, గనులు, రైల్వేలు, పరిశ్రమలు ఇతర సహజ వనరులన్నింటినీ సామ్రాజ్య వాదులు, భారత కార్పొరేట్ కంపెనీల హస్తగతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏండ్లుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చివేసి చట్ట రూపంలోకి బీజేపీ సర్కార్ తీసుకు వచ్చిందని, కార్మికుల సంక్షేమం గాలికి వదిలేసిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని రంగాలలో అవకాశాలు దొరుకుతాయని ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలంగాణ ప్రజానీకం ఆశపడ్డారన్నారు. కానీ, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో అంటకాగుతున్నారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలపైన అణిచివేతకు పూనుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏండ్లుగా అటవీ ప్రాంతంలో జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీలు సాగుచేసుకుంటున్న భూములను హరితహారం పేరుతో ఆక్రమించుకుంటున్నారన్నారు.

Next Story

Most Viewed