మరోసారి హుజురాబాద్ వైపే అందరిచూపు.. ఈటల మ్యాజిక్ చేసేనా..?

by  |
మరోసారి హుజురాబాద్ వైపే అందరిచూపు.. ఈటల మ్యాజిక్ చేసేనా..?
X

దిశ, హుజురాబాద్: అందరి చూపు హుజురాబాద్ వైపే ఉంది. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతీష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉపఎన్నికలో ఫలితం మాత్రం తారుమారైంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రజానీకం దృష్టి హుజురాబాద్ వైపు మళ్లింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ అధిష్టానం పకడ్బందీ వ్యూహం పన్ని స్థానిక ప్రజాప్రతినిధులను క్యాంపునకు తరలించింది. జిల్లాలో కేటాయించిన పోలింగ్ బూతులకు క్యాంపు నుంచే నేరుగా ఓటర్లను తరలించి, క్రాస్ ఓటింగ్ కు ఆస్కారం లేకుండా జిల్లా ఇన్చార్జిలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

అయితే, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉన్న కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సైదాపూర్ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి కి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం కావడంతో హుజురాబాద్ పైనే అందరి దృష్టి కేంద్రీకృతం అయింది. ప్రభాకర్ రెడ్డికి హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల ఓటర్లతో నేరుగా సంబంధాలు కలిగి ఉండటం, ఎమ్మెల్యే ఈటలకు పరోక్ష మద్దతు ఇచ్చే ఓటర్లు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకం కానున్నారు.

నిధులు, విధుల విషయంలో ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ప్రజాప్రతినిధులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఓటర్ల సంఖ్య కూడా భారీగానే ఉండటంతో గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపనుంది. బైపోల్ తర్వాత తన సత్తా చూపెడుతానని టీఆర్ఎస్ ప్రభుత్వానికి గతంలోనే హెచ్చరిక చేసిన ఈటల.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి ఎత్తుగడ వేస్తున్నాడో ఎవరికీ అంతుచిక్కడం లేదు. టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ప్రజాప్రతినిధుల ఓట్లు మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థులు ఎల్. రమణ, భాను ప్రసాదరావుకు పడకపోయినట్టయితే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందనే సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని ఆ పార్టీకి చెందిన పలువురు అభిప్రాయ పడుతున్నారు.



Next Story