స్కూల్స్ రీఓపెన్.. రూల్స్ పాటిస్తున్నారా..?

by  |
స్కూల్స్ రీఓపెన్.. రూల్స్ పాటిస్తున్నారా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మరో రెండు రోజులలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. కొవిడ్ నిబంధనలతో పాటు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంది. ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లలో కొవిడ్ నిబంధనల అమలుపై అన్నీ అనుమానాలే కనిపిస్తున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రించే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదనే ఆరోపనలు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం చేరుకునేందుకు కూడా మరికొన్ని రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి.

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9,10 క్లాసులకు తరగతి బోధన ప్రారంభమవుతోంది. ఫిజికల్ క్లాసులకు హాజరవ్వడమనేది తప్పనిసరి కాకపోయినప్పటికీ 60 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే తమ అంగీకరాన్ని తెలిపినట్టు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. కొవిడ్ పరిస్థితుల తర్వాత మొదటిసారి స్కూళ్లకు వస్తున్న విద్యార్థులకు అవసరమైన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోంది.

కొవిడ్ కారణంగానే ఇబ్బందులు

సాధారణంగా స్కూళ్లు తెరిచేనాటికే అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం ఉండేది. ఈ సారి కొవిడ్ కారణంగా ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, కొత్త యూనిఫాంలు అందిస్తామని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. విద్యార్థుల సంఖ్యను బట్టి టైలర్లను మాట్లాడి బట్టలు కుట్టించే బాధ్యత స్కూల్ ప్రధానోపాధ్యాయులకు అప్పగించేవారు. అలా చేసినా కనీసం నెల రోజుల్లోపే అందరు విద్యార్థులకు యూనిఫాంలు అందే అవకాశాలు లేవు.

స్కూళ్లలో విద్యార్థులకు కనీస అవసరాలైన తాగు నీరు, టాయిలెట్ల నిర్వాహణ కూడా సమస్యగా మారనుంది. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో మిషన్ భగీరథ సౌకర్యం ఉండటంతో ఆ నీటినే అందించనున్నట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే వాటర్ ట్యాంక్‌లు శుభ్రపరచడం, బ్లీచింగ్ చేయడం, గ్లాసులు శుభ్రపరచడం వంటివి చేసేందుకు సిబ్బందిని ప్రభుత్వం నియమించడం లేదు. స్కూళ్లను శుభ్రం చేసే డ్యూటీలను స్థానిక సంస్థల కార్మికులే చేస్తారని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ, ఆయా యూనియన్లు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. స్కూళ్లు ప్రారంభమైతే ఈ సమస్య తెరమీదకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సిబ్బంది కొరతే అసలు సమస్య

ప్రభుత్వం స్కూళ్లకు అందజేసిన శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసేందుకు సిబ్బందిని ఎలా ఏర్పాటు చేసుకోవాలన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. టాయిలెట్స్, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉపాధ్యాయుల మీదనే పడనుంది. ప్రతీ విద్యాసంస్థలోనూ ఐసోలేషన్ గది ఉండాలని ప్రభుత్వం సూచించినప్పటికీ ప్రైవేట్ స్కూళ్లలో అలాంటివేమీ కనిపించడం లేదు. మధ్యాహ్న భోజన పనులను పాత ఏజెన్సీలే నిర్వహిస్తాయని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నాయి.

వీరికి కూడా గతేడాది రావాల్సిన బిల్లులు, జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారని మధ్యాహ్న భోజన కార్మికులు ప్రశ్నిస్తున్నారు. స్కూల్‌కు వచ్చే విద్యార్థులకు అవసరమైన టాయిలెట్లు, నీటి వసతి సరిగా లేదు. వీటిని నిర్వహించేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ముందుకు రావడం లేదు. ఏడు గంటల పాటు విద్యార్థులంతా స్కూల్లోనే ఉండాల్సి వస్తుంది. స్కూల్ సిబ్బంది లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదురయ్యి, విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed