గులాబ్’ ఎఫెక్ట్.. హైదరాబాద్‌కు హై అలర్ట్

by  |
ap-rains
X

దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. హైదరాబాద్ నగరానికి జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ (విపత్తు నిర్వహణ) ‘హై అలర్ట్’ వార్నింగ్ ఇచ్చారు. రానున్న మూడు రోజుల పాటు భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశముందని, తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరించారు. మరోవైపు ఢిల్లీలో ఉన్న ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలిఫోన్ కాన్ఫరెన్సు నిర్వహించి అప్రమత్తం చేశారు.

‘గులాబ్’ తుపాను కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ వార్నింగ్ జారీ అయింది. దక్షిణ తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. హైదరాబాద్ నగరంలో సగం ప్రాంతం రెడ్ అలర్ట్ జోన్‌లో ఉన్నందున జాతీయ విపత్తు రెస్పాన్స్ ఫోర్స్ దళాలు అవసరమైన వెంటనే రంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నాయి. వరంగల్, కొత్తగూడెం జిల్లాల్లోనూ కొన్ని దళాలు అలర్టుగా ఉన్నాయి. ప్రతీ జిల్లాలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించిన సీఎస్ పునరావాస కేంద్రాల్లో తగిన ఆహార పదార్ధాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. రానున్న మూడు రోజుల పాటు ‘గులాబ్’ ప్రభావం ఉండొచ్చని వాతావరణ కేంద్రం అధికారులు ఇచ్చిన సూచన మేరకు విపత్తు నిర్వహణ విభాగం అధికారులతోనూ సీఎస్ టెలిఫోన్‌లో మాట్లాడారు. అన్ని జిల్లాల్లో పోలీసు, ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు. తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేక నిఘా ఉంచి, ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

వారం రోజుల వరకు సెలవుల రద్దు

‘గులాబ్’ తుపాను కారణంగా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసే అతి భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ కమిషనర్, విపత్తు నిర్వహణా విభాగం వివిధ విభాగాలతో సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేసింది. అన్ని విభాగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు వారం రోజుల పాటు వీక్ ఆఫ్, సెలవులను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండేలా, సిబ్బంది వెంటనే సహాయక చర్యల్లోకి దిగేలా ఈ నిర్ణయం జరిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని సహాయ, పునారావాస శిబిరాలను నెలకొల్పినట్లు తెలిపారు. ప్రజలను తరలించడానికి వాహనాలను కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.

కాలనీలు నీట మునిగితే ప్రజలను బైటకు తీసుకురావడానికి వీలుగా పడవలను, ఇతర ఉపకరణాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు అలర్టు హెచ్చరిక ఉంటుందని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని జోన్ల కమిషనర్లు సహాయ పునరావాస చర్యలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా, ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలకు తగినట్లుగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నెల 28న నిర్మల్, నిజామామాద్, జగిత్యాల, సిరిసిల్ల, వరంగల్ రూరల్, కమారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో గరిష్ట స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.


Next Story

Most Viewed