యూట్యూబర్లు జర జాగ్రత్త.!

by  |
యూట్యూబర్లు జర జాగ్రత్త.!
X

దిశ, వెబ్‌డెస్క్: ఒక్క వీడియో పెట్టి ఓవర్‌నైట్‌లో వైరల్ అయ్యి అందరూ డబ్బులు సంపాదిస్తున్నారనే ఉద్దేశంతో ఇప్పుడు ఎవరు పడితే వాళ్లు యూట్యూబ్ చానల్ పెట్టేస్తున్నారు. వీటిలో సినిమా వాళ్లకు, సెలెబ్రిటీలకు సంబంధించిన వార్తలు, అప్‌డేట్స్ ఇచ్చే చానళ్లకు క్రేజ్ ఎక్కువ. ఇలాంటి చానళ్లు ఎన్ని ఉన్నా ఒకే ఒక్క వైరల్ వార్తతో బోలెడంత మంది సబ్‌స్క్రైబర్లను పొందే అవకాశం ఉంటుంది. కానీ, అన్ని వార్తలు వైరల్ కావు కదా…అందుకే ఉన్న వార్తల నుంచి వైరల్ వార్తను సృష్టించాలి. ఇలా సృష్టించడం అంటే లేని వార్తను తయారుచేయడమే. దీన్ని ఫేక్ న్యూస్ అంటారు. సినిమా వాళ్లే కదా..ఏది రాసినా, ఏది చూపించినా ఏం కాదు..వాళ్లు వచ్చి అడగరు కదా అనే ధైర్యంతో చిన్న చిన్న యూట్యూబర్‌లు ఇలా ఫేక్ న్యూస్‌లు క్రియేట్ చేస్తుంటారు. అయితే సినిమా వాళ్లు కూడా మనుషులే.. కొన్ని వదిలేస్తారు. కానీ, కొన్నింటిని సీరియస్‌గా తీసుకుంటారు. తన గురించి తప్పుగా వీడియో చేసిన ఓ యూట్యూబర్ మీద బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రూ.500 కోట్లు పరువు నష్టం దావా వేశాడు. దీన్ని బట్టి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే, చేయాలనుకునే యూట్యూబర్‌లు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన ఆధారాలు లేకుండా ఏది పడితే అది చెప్పొద్దు. ఇంతకీ అక్షయ్ ఈ దావా ఎందుకు వేశాడంటే..

సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న రషీద్ సిద్ధిఖీ అనే వ్యక్తి ఎఫ్ఎఫ్ న్యూస్ పేరుతో ఒక యూట్యూబ్ చానల్ నడుపుతున్నాడు. అందులో ఎక్కువగా సుశాంత్ కేసుకు సంబంధించిన వీడియోలు పెట్టడం మొదలుపెట్టాడు. సుశాంత్ ఆత్మహత్య వెనక కారణం ఎవరో తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్న తరుణంలో ఒక వీడియో పెట్టాడు. దానికి మంచి వ్యూస్ రావడంతో ఇక అన్ని సుశాంత్ కేసుకు సంబంధించిన వీడియోలే పెట్టేవాడు. దీంతో మే నెలలో లక్ష ఉన్న సబ్‌స్క్రైబర్‌లు ఇప్పుడు మూడు లక్షలు దాటిపోయారు. అలాంటి ఒక వీడియోలో అక్షయ్ కుమార్‌కు సుశాంత్ ఆత్మహత్యలో పాత్ర ఉందని, రియా చక్రవర్తికి, అక్షయ్‌కు సంబంధం ఉందని రషీద్ ప్రస్తావించాడు. ఈ విషయమై అక్షయ్ కుమార్, రషీద్ మీద రూ.500 కోట్ల పరువు నష్టం దావా ఫైల్ చేశాడు. మే నెలలో రూ. 296 ఆదాయం పొందిన రషీద్, సెప్టెంబర్‌లో రూ. 6,50,898 ఆదాయం పొందినట్లు తెలుస్తోంది. ఒక్క సుశాంత్ వార్తల వల్లనే రూ. 15 లక్షలకు పైగా రషీద్ సంపాదించినట్లు సమాచారం. కాబట్టి ఫేక్ న్యూస్ చెప్పే యూట్యూబర్‌లు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా పరువు నష్టం దావా వేశారంటే సంపాదించినది మొత్తం అయిపోవడమే కాకుండా అప్పులపాలు కావాల్సి వస్తుంది.



Next Story

Most Viewed