'మోడీని మేం హెచ్చరిస్తున్నాం'

by  |
మోడీని మేం హెచ్చరిస్తున్నాం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రైల్వేల ప్రైవేటీకరణకు నిరసనగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి, స్టేషన్ మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యానికి పూనుకుందని ఆరోపించారు. దాంట్లో భాగంగానే రైల్వే, బ్యాంక్, ఎల్ఐసీ, డిఫెన్, బీఎస్ఎన్ఎల్ లాంటి లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎఫ్డీఐల పేరు మీద ప్రైవేటు పెట్టుబడిదారుల దగ్గర వాటాలను విక్రయిస్తుందన్నారు. రైల్వేలో లాభాల్లో ఉన్నవాటిని ప్రైవేటు వ్యక్తులకు అమ్మటానికి సిద్ధపడుతున్నారని మండిపడ్డారు. భారతదేశానికి స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారు తెలంగాణలో నిజాం నవాబు అండర్ లో రైలు వ్యవస్థ పని చేసిందని, స్వాతంత్రానంతరం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వెళ్లిన విషయాలను ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వాల సహకారంతో అధికారులు, ఉద్యోగులు, కార్మికులు ప్రజల కృషితో రైల్వే సంస్థ లాభాల్లో నడుస్తోందన్నారు. కానీ, మోడీ ప్రభుత్వం దుర్బుద్ధితో రైల్వేను కమీషన్ల కోసం మోడీ అనుచరులకు కట్టబెట్టే కుట్ర చేస్తుందన్నారు. ఇప్పటికైనా మోడీ తన ఆలోచనను ఉపసంహరించుకోవాలని, రైల్వేను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని లేనియెడల కార్మిక సంఘాలతో ప్రారంభమైన ఈ పోరాటం ప్రజా ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి నర్సింగ్ రావు జిల్లా నాయకులు పి సుధాకర్, రాజన్న, ముత్యాలు, రంజిత్, రఘురాం, వెంకటేశం గుప్తా, రాజు, నజీర్, మురళి, హర్షత్ తదితరులు పాల్గొన్నారు.



Next Story