దూకుడు పెంచిన ఎయిర్‌టెల్!

by  |
దూకుడు పెంచిన ఎయిర్‌టెల్!
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్నేళ్లుగా భారత టెలికాం రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న రిలయన్స్ జియోకు ఇటీవల టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ పోటీ ఇస్తోంది. ప్రస్తుత ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి మొత్తం సబ్‌స్క్రైబర్లను సాధించడంలో ఎయిర్‌టెల్, జియో కంటే వెనకబడి ఉన్నప్పటికీ వరుసగా మూడో నెలలో యాక్టివ్ యూజర్ల విషయంలో ఎయిర్‌టెల్ మొదటిస్థానంలో నిలిచినట్టు ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో ఎయిర్‌టెల్ 37 లక్షల కొత్త కస్టమర్లను చేర్చుకుంది. అలాగే, యాక్టివ్ యూజర్ల వాటా 34.6 శాతానికి, కస్టమర్ల సంఖ్య 34 కోట్లకు చేరుకుంది. సమీక్షించిన నెలలో రిలయన్స్ జియో 2 లక్షల యాక్టివ్ వినియోగదారులను కోల్పోవడంతో, మొత్తం యాక్టివ్ వినియోగదారుల సంఖ్య 32.4 కోట్లకు పడిపోయింది. అదేవిధంగా యాక్టివ్ కస్టమర్ల మార్కెట్ వాటా 33 శాతానికి తగ్గిందని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాలు వెల్లడించాయి.

రిలయన్స్ జియో మొత్తం వినియోగదారుల సంఖ్య 41.4 కోట్లుగా ఉంది. ఇక, వొడాఫోన్ ఐడియా సైతం ఫిబ్రవరిలో కొత్తగా 6.52 లక్షల మంది వినియోగదారులను చేర్చుకోవడం ద్వారా మొత్తం వినియోగదారుల సంఖ్య 28.2 కోట్లకు చేరుకుంది. గణాంకాల ప్రకారం.. దేశీయ మూడు దిగ్గజ టెలికాం ఆపరేటర్లు ఫిబ్రవరిలో కొత్త సబ్‌స్క్రైబర్లను సాధించినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలో కొత్త వినియోగదారులను సాధించిన వొడాఫోన్ ఐడియా కస్టమర్లను చేర్చుకోవడం గత 30 నెలల్లో ఇది రెండోసారి మాత్రమే. ఇదే సమయంలో 2 లక్షల యాక్టివ్ వినియోగదారులను కూడా కోల్పోయి, దాని వాటా 26.1 శాతానికి పరిమితమయింది. దీంతో వొడాఫోన్ ఐడియా యాక్టివ్ కస్టమర్ల సంఖ్య 25.6 కోట్లకు తగ్గింది.

Next Story

Most Viewed