దేశీయ 5జీ టెక్నాలజీ కోసం టాటా గ్రూపుతో ఎయిర్‌టెల్ భాగస్వామ్యం

by  |
దేశీయ 5జీ టెక్నాలజీ కోసం టాటా గ్రూపుతో ఎయిర్‌టెల్ భాగస్వామ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ పరిష్కారాల కోసం ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ సోమవారం ప్రకటించింది. దేశీయ టెక్నాలజీతో 5జీ సేవలను అందించేందుకు ఎయిర్‌టెల్ టీసీఎస్‌తో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా 2022, జనవరి నుంచి వాణిజ్య అవసరాలకు కావాల్సిన సేవలు అందుబాటులోకి రానున్నట్టు ఇరు సంస్థలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

టాటా గ్రూప్ సంస్థ ఇప్పటికే ఓ-రాన్(ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్) ఆధారిత రేడియో, ఎన్ఎస్ఏ/ఎస్ఏ(నాన్-స్టాండ్‌లోన్)కోర్‌ను అభివృద్ధి చేసింది. టీసీఎస్ సంస్థ తన గ్లోబల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ నైపుణ్యం ద్వారా నెట్‌వర్క్, పరికరాలు ఎక్కువగా పొందుపరిచిన 3జీపీపీ, ఓ-ఆర్ఏఎన్ ప్రమాణాలకు తగినట్టుగా అన్ని రకాల పరిష్కారాలను అందించేందుకు అంతర్జాతీయ అనుభవాలను వినియోగించనుంది. ఈ టెక్నాలజీతో ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

‘5జీ, దాని అనుబంధ టెక్నాలజీ పరిజ్ఞానాలకు భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు టాటా గ్రూపుతో భాగస్వామ్యం చేసుకున్నాం. అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, నైపుణ్యంతో ప్రపంచానికి అత్యాధునిక పరిష్కారాలను, అప్లికేషన్లను రూపొందించడంలో భారత్ ముందంజలో ఉందని’ ఎయిర్‌టెల్ ఇండియా ఎండీ, సీఈఓ గోపాల్ మిట్టల్ చెప్పారు. కాగా, ఇప్పటికే ఎయిర్‌టెల్ సంస్థ దేశవ్యాప్తంగా 5జీ ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఈ ట్రయల్స్‌లో ఎయిర్‌టెల్ 5జీ టెక్నాలజీతో సెకనుకు కనీసం 1జీబీ స్పీడ్ డేటాను ట్రాన్స్‌ఫర్ అయినట్టు నివేదికల ద్వారా వెల్లడైంది.


Next Story

Most Viewed