Air india సిబ్బంది వేతనాల్లో కోత

by  |
Air india సిబ్బంది వేతనాల్లో కోత
X

న్యూఢిల్లీ : ఎయిరిండియా సిబ్బంది వేతనాల్లో కోత పెడుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్ర పౌరవిమానయాన శాఖ, ఎయిరిండియా లిమిటెడ్ బోర్డు సభ్యులు ఆమోదించిన వేతనాల హేతుబద్ధీకరణ గురించిన ప్రకటన బుధవారం విడుదలైంది. దీని ప్రకారం, ఐడీఏ, హెచ్ఆర్ఏ సహా బేసిక్ పేతో సంబంధమున్న అలవెన్సులపై ఎటువంటి కోతలు పెట్టకున్నా.. కీలకమైన ఫ్లైయింగ్ అలవెన్సు సహా ఇతర వాటిపై 40శాతం కోత పెడుతున్నట్లు ప్రకటించింది. నెలకు గరిష్టంగా 20గంటలకు మాత్రమే ఫ్లైయింగ్ అలవెన్సు కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. ఫ్లైయింగ్ అలవెన్సు సవరణ రేటు ఆధారంగానే సిమ్యులేటర్ ట్రైనింగ్ గంటలకూ జీతముంటుందని తెలిపింది.

కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత వైమానిక రంగంలో వేతనాలందుకోవడం ఒక అదృష్ట కార్యంగా మారింది. ఇటీవలే ఎయిరిండియా పైలట్లు గతనెల వేతనాలను అందుకున్నారు. ఈ శుభవార్తను ఆనందించేలోగానే మరో వార్త కలత పెట్టింది. జూన్ బేసిక్ సాలరీ పొందితే, ఏప్రిల్ నెల ఫ్లైయింగ్ అలవెన్సులు పొందామని, కొందరైతే తమ వేతనాల్లో 80శాతం కోత పడిందని వాపోయారు. పైలట్ల జీతాల్లో అలవెన్సులే కీలకం. వేతనంలో 70శాతం మేర అలవెన్సులే ఉంటాయి.

Next Story

Most Viewed