మంత్రి కొప్పులను నిలదీసిన మజ్లిస్ సభ్యులు

by  |
మంత్రి కొప్పులను నిలదీసిన మజ్లిస్ సభ్యులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మైనారిటీ సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ అసెంబ్లీ వేదికగా పలువురు మజ్లిస్ సభ్యులు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నిలదీశారు. ఆర్థిక సాయంతో పాటు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల విషయంలో మైనారిటీలకు అన్యాయమే జరుగుతోందన్నారు. ఐదేండ్లుగా లబ్ధి చేకూరక వందలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారని మజ్లిస్ సభ్యుడు ఖాద్రి, జాఫర్ హుస్సేన్ శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రిని సూటిగానే ప్రశ్నించారు. నాలుగేండ్లుగా ప్రభుత్వ లక్ష్యం సగం కూడా అమలుకాలేదని 2016-17లో 13,234 మందికి మైనారిటీ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకున్నా.. కేవలం 6,254 మందికి మాత్రమే అందించిందని గుర్తుచేశారు.

2017-18లో 11,734 మందిని టార్గెట్‌గా పెట్టుకుంటే కేవలం 1,324 మందికి మాత్రమే లబ్ధి చేకూరిందన్నారు. 2018-19లో 13,582 మందికి ఇవ్వాలనుకున్నా కేవలం 1,691 మందికే ఇచ్చారని, 2019-20లో 2,626 మందిలో కేవలం 1,183 మందికి మాత్రమే సాయం అందిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 420 మందికి సాయం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా కనీసం ఒక్కరికి సైతం సాయం అందలేదన్నారు. దీనిపై మంత్రి పలు రకాలుగా సమాధానం ఇచ్చినా మజ్లిస్ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేయలేదు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అంబేద్కర్, ఫూలే విద్యానిధి పథకం పేరుతో పథకాలను అమలు చేస్తున్నా ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు లేవని టీఆర్ఎస్ సభ్యులు వివేకానందగౌడ్, గ్యాదరి కిషోర్, హరిప్రియ తదితరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రం మొదలు ఇప్పటివరకు ఎనిమిది ఏండ్లలో కేవలం 3,676 మందికి మాత్రమే రూ.589.69 కోట్ల మేర ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందించినట్టు మంత్రి గణాంకాలు వెలువరించారు.

Next Story

Most Viewed