‘ఆహా’ అనిపించడానికి రంగంలోకి అల్లు అర్జున్

by  |
‘ఆహా’ అనిపించడానికి రంగంలోకి అల్లు అర్జున్
X

దిశ, వెబ్‌డెస్క్ :
సినిమా థియేటర్లు తెరుచుకోకపోవడంతో ప్రస్తుతమంతా ఓటీటీల హవా నడుస్తోంది. భవిష్యత్తులోనూ వీటి రాజ్యమే ఉండనుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ ఈ సత్యాన్ని ముందే గ్రహించారు. ఈ నేపథ్యంలోనే ‘ఆహా’ పేరుతో ఓటీటీని లాంచ్ చేసిన అరవింద్.. మెల్లగా మెల్లగా కంటెంట్‌ను పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు. యూత్‌‌తో పాటు ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ.. ఓటీటీలో వెబ్ సిరీస్‌లు, సినిమాలు, షోస్ రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘ఆహా’ను మరింత పాపులర్ చేసేందుకు అల్లు అర్జున్‌ను రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది.

సినిమాలు, వెబ్ సిరీస్‌‌లు, టాక్ షోలు, డబ్బింగ్ సినిమాల‌తో ఫుల్ ఎంటర్ టైన్‌మెంట్‌ అందిస్తున్న ‘ఆహా’.. ప్రారంభించిన కొన్ని నెలల్లోనే 20 మిలియన్ల సబ్‌స్కైబర్లను చేరుకుంది. మరింతమంది నెటిజన్లను ఆకర్షించేందుకు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తోంది. అందులో భాగంగానే.. ఈ నెల 13వ తేదీన ఒక భారీ వేడుకను ఏర్పాటు చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ వేడుకకు అల్లు అర్జున్ ప్రధాన గెస్ట్‌గా రాబోతుండగా.. ఇకపై ‘ఆహా’కు ఆయనే బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే యంగ్ హీరో, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘ఆహా’కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు అల్లు అర్జున్ నిర్మాతగా మారి వెబ్ సిరీస్‌లు, చిన్న సినిమాలు కూడా తీసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నవంబర్ 13న ‘ఆహా’ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమ వేదికపై రాబోయే సంవత్సర కాలం పాటు ఆహాలో వచ్చే కార్యక్రమాలను అనౌన్స్ చేయబోతున్నట్టు అల్లు అరవింద్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఇక సమంత తొలిసారి హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘సామ్ జామ్’ కూడా అదే రోజున ‘ఆహా’లో స్ట్రీమింగ్ కాబోతుంది.

Next Story