‘శిక్షణ తరగతులను విజయవంతం చేయండి’

by  |
‘శిక్షణ తరగతులను విజయవంతం చేయండి’
X

ఈ నెల 25, 26 తేదిల్లో సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని దుపహాడ్ గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం(వ్యకాస) జిల్లా స్థాయి శిక్షణ తరగతులను నిర్వహించనున్నామనీ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనరసింహా రెడ్డి భవన్‌లో వ్యకాస జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రాములు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కుట్రపన్నుతోందని ఆరోపించారు. అందులో భాగంగానే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గ్రామీణ వ్యవసాయ కార్మికుల ఉపాధిహామీ చట్టానికి కేటాయించే నిధుల్లో కోతవిధించారన్నారు. గతేడాది ఈ చట్టానికి రూ.71వేల కోట్లు కేటాయించగా, ఈసారి మాత్రం కేవలం రూ.61,500 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని తెలిపారు. కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రాయితీలను ప్రకటిస్తున్న కేంద్రం.. వ్యవసాయ కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. దేశంలోని 15కోట్ల వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడిచే విధంగా బడ్జెట్ ఉందని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధి కూలీలకు వెంటనే బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించి కూలీలను ఆదుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని అన్నారు. సుప్రీం తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 24న జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన వ్యక్తం చేస్తామన్నారు. ఈ సమావేశంలో వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, ఉపాధ్యక్షులు సోమ పంగ జానయ్య, సహాయ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed