నిరుద్యోగులూ.. క్షమించండి : మంత్రి నిరంజన్ రెడ్డి

by  |
Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధి కల్పన అంశాల విషయంలో తన వ్యాఖ్యలు ఎరినైనా బాధపెడితే క్షమించాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. బాధపెట్టినందుకు మన్నించడని సోమవారం మంత్రుల నివాస సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. త్వరలో నోటిఫికేషన్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటుందని, యువత పూర్తిస్థాయిలో ఉద్యోగాలపై దృష్టి పెట్టి అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. నిరుద్యోగుల విషయంలో తాను మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న దానికి సంబంధం లేదని చెప్పారు.

గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి హమాలీల ద్వారా ధాన్యం సేకరణ చేస్తోందని చేసిన వ్యాఖ్యలకు నిరుద్యోగ యువతకు ముడిపెడుతూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కేంద్రంలో ఉన్న 7 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ఎంపీలు బాధ్యత తీసుకుని పనిచేస్తారా అని ప్రశ్నించారు. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రధాన రాష్ట్రాలు బీహార్, యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడులలోని జనాభాతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 1.5 శాతం మించలేదన్నారు. తెలంగాణలో ఉద్యోగుల శాతం ఇతర రాష్ట్రాలకు మించి అధికంగా ఉందని, అయినప్పటికీ ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం నిరంతరంగా భర్తీ చేస్తోందని పేర్కొన్నారు.

నదీ జలాలు అంశాలు రాష్ట్ర ప్రజల జీవన్మరణ సమస్యలని చెప్పుకొచ్చారు. తెలంగాణ పచ్చబడడం కొంత మంది జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. కేంద్రం ఏకపక్షగా నిర్ణయాలను తీసుకోవడం అత్యంత విచారకరమన్నారు. ట్రిబ్యునల్‌కు అప్పగించకుండా కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య హక్కులు తమ పరిధిలోకి తీసుకునేలా గెజిట్ విడుదల చేయడం అన్యాయమన్నారు. కేంద్రం అవలంభిస్తున్న వైఖరి ఇరు రాష్ట్రాలకు నష్టం చేకూర్చుతుందన్నారు. ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా కేంద్రం తెచ్చిన గెజిట్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ న్యాయ నిపుణులతో సంప్రదించి ముందుకు తీసుకెళ్తారని పేర్కొన్నారు. ఎరువుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నెలవారీ వాటాపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీ వెళ్తున్నామని చెప్పారు.



Next Story

Most Viewed