రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణం..

by  |
రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణం..
X

దిశ, న్యూస్ బ్యూరో :
రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం మరింత పెరుగుతోందని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి బుధవారం నివేదిక సమర్పించింది. దీని ప్రకారం ఇప్పటి వరకు 79,05,471 ఎకరాల్లో 21 రకాల పంటలు సాగవుతున్నాయి. ఈసారి సాగు 79 లక్షల ఎకరాలు దాటింది. పత్తి పంట సాధారణ సాగు 44.50 లక్షల ఎకరాలు ఉండగా, ఇప్పటికే 52.10 లక్షల ఎకరాలు దాటింది. రాష్ట్రంలో వరి సాగు నెమ్మదిగా పెరుగుతోంది. దాదాపు 25 లక్షల ఎకరాల్లో ఈసారి తెలంగాణ సోన పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 10.20 లక్షల ఎకరాలలో నాట్లు వేశారు. మొక్కజొన్న పంట దాదాపు 1.50 లక్షల ఎకరాలకు చేరుకుంది. కంది పంట కూడా అనుకున్న స్థాయిలో వేస్తున్నారు. ఇప్పటి వరకు 7.78 లక్షల ఎకరాల్లో పంట వేశారు. ఒకప్పుడు కరువు జిల్లాలుగా పేరొందిన ప్రాంతాల్లో ఈసారి అంచనాకు మించి పంటలు సాగవుతున్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలో సాధారణ సాగు 2.88 లక్షల ఎకరాలు ఉండగా, ఇప్పటికే 2.38 లక్షల ఎకరాలు దాటింది. నాగర్ కర్నూల్ జిల్లాలో సాధారణ సాగు 5.19 లక్షల ఎకరాలకు 4.44 లక్షల ఎకరాలు, వనపర్తి జిల్లాలో 1.91 లక్షల ఎకరాలకు 45 వేల ఎకరాలు, గద్వాల జిల్లాలో 2.93 లక్షల ఎకరాలకు 1.72 లక్షల ఎకరాలు, నారాయణపేట జిల్లాలో 3.59 లక్షల ఎకరాలకు 3.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ సాగు 4.85 లక్షల ఎకరాలు ఉండగా, ఇప్పటి వరకు 5.39 లక్షల ఎకరాలకు పెరిగింది. మంచిర్యాల జిల్లాలో 2.46 లక్షల ఎకరాలకు 1.79 లక్షలు, నిర్మల్ జిల్లాలో 3.48 లక్షల ఎకరాలకు 2.81 లక్షల ఎకరాలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 3.25 లక్షల ఎకరాల సాధారణ సాగుకు బుధవారం నాటికి 3.73 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. రాష్ట్రంలో మొత్తం పంటల సాగులో 76 శాతం పంటలు వేసినట్లు నివేదికల్లో పేర్కొన్నారు. సాధారణ సాగులో 76 శాతం ఉండగా, ప్రభుత్వం అంచనా వేసిన తాజా సాగు 1.25 కోట్ల ఎకరాల్లో 63 శాతంగా నమోదైంది. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, నారాయణపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో 90 నుంచి 100 శాతానికి పంటల సాగు చేరింది.

వర్షాలు సమృద్ధిగా..

రాష్ట్రంలోని 22 జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిసినట్లు నివేదికలో వెల్లడించారు. మరో పది జిల్లాలో సాధారణ వర్షపాతం ఉండగా, నిర్మల్ జిల్లాలో మాత్రమే తక్కువ వర్షం కురిసింది. 25 శాతం వరకు మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ, పసుపు పంటలు, 50 శాతం లోపు వరి, రాగి, పెసర్లు, 75 శాతం వరకు చెరుకు, మినుములు, 100 శాతం వరకు సోయాబీన్, జొన్న పంటలు సాగవుతున్నాయి. 100 శాతానికి పైగా కంది, పత్తి పంటలు సాగైనట్లు తేల్చారు. వనపర్తి జిల్లాలో మాత్రం 25 శాతం వరకు పంటలు వేశారు. ములుగు, ఖమ్మం, పెద్దపల్లి, సూర్యాపేట, జగిత్యాల జిల్లాలో 50 శాతం వరకు సాగవుతున్నాయి. మేడ్చల్, సిరిసిల్ల, గద్వల, వరంగల్ అర్బ్, సిద్ధిపేట, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాలు 75 శాతం వరకు, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జనగామ, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, మెదక్, సంగారెడ్డి జిల్లాలు 100 శాతం వరకు, నారాయణపేట, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 100 శాతానికిపైగా పంటలు సాగు చేస్తున్నారు.

Next Story

Most Viewed