బీపీసీఎల్ వాటా విక్రయానికి మరోసారి గడువు పెంపు!

by  |
బీపీసీఎల్ వాటా విక్రయానికి మరోసారి గడువు పెంపు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)ను ప్రైవేటీకరించడానికి ఆహ్వానించే బిడ్‌ల దరఖాస్తులకు ప్రభుత్వం మరోసారి గడువును పొడిగించింది. గతంలో జూన్ 13 వరకు గడువు ఇచ్చినప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా లేనందున దీన్ని జూలై 31కి పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2019 నవంబర్‌లో బీపీసీఎల్ సంస్థలో 52.98 శాతం ప్రభుత్వ వాటాను విక్రయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మార్చి 7 నుంచి ఆసక్తి ఉన్న కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చని మొదట మే 2 వరకూ ముగింపు గడువుని ఇచ్చింది. అనూహ్యంగా కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో దీన్ని పొడిగిస్తూ వచ్చింది. తాజాగా, పరిస్థితులు సానుకూలంగా లేవని జూలై 31కి పొడిగించామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంటండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్(డీఐపీఏఎమ్) బుధవారం నోటీసులను జారీ చేసింది. బీపీసీఎల్ సంస్థలో ప్రభుత్వానికి 52.98 శాతానికి సమానమైన 114.91 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నట్టు డీఐపీఏఎమ్ పేర్కొంది. బీపీసీఎల్ సంస్థ దేశవ్యాప్తంగా నాలుగు రిఫైనరీలను నిర్వహిస్తోంది. అవి, కేరళలోని కొచ్చి, మహారాష్ట్రలోని ముంబై, అసోంలోని నుమాలీఘర్, మధ్యప్రదేశ్‌లోని బైన్ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో ఏడాదికి 38.3 మిలియన్ టన్నుల చమురును శుద్ధి చేస్తున్నారు. ఈ మొత్తం దేశ చమురు శుద్ధి సామర్థ్యంలో 15 శాతం ఉంటుంది.



Next Story

Most Viewed