LMD భూ నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. 45 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి..!

by  |
lmd dam
X

దిశప్రతినిధి, కరీంనగర్ : ఎట్టకేలకు 45 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కింది. డ్యాం నిర్మాణం కోసం సర్వం కోల్పోయిన వారికి అనుకూలంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. భూ నిర్వాసితులకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. అత్యంత అరుదుగా చోటు చేసుకునే ఘటనల్లో ఈ తీర్పు ఒకటిగా నిలుచిపోనుందని చెప్పవచ్చు. కరీంనగర్ సమీపంలో 1974-75 ప్రాంతంలో లోయర్ మానేరు డ్యాం నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా ముంపునకు గురైన భూ నిర్వాసితులకు పరిహారం నామమాత్రంగా ఇస్తుండటంతో తమ వారసులు జీవనం సాగించడం కష్టంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసిత కుటుంబాలకు చెందిన వారికి ఉద్యోగాలు కూడా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో 1986 ఏప్రిల్ 15న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 98 జీఓను విడుదల చేసి నిర్వాసితుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది.

అయితే, ఈ జీఓ విడుదల అయిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొంది. అప్పటికే ముంపునకు గురైన బాధిత గ్రామాల ప్రజలు చెల్లా చెదరై నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లి పోయారు. ఈ సమాచారాన్ని కొంతమంది సకాలంలో అందుకోలేకపోయారు. దీంతో కొంతమంది ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో జీఓలో విధించిన గడువులోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ క్రమంలోనే తమకు ఉద్యోగాలు కల్పించే విషయంలో గడువు విధించడం వల్ల సకాలంలో దరఖాస్తు చేసుకోలేదని ప్రభుత్వం చెప్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ఉమ్మడి రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా 8 వారాల గడువు ఇవ్వాలని జీఓ 98 ప్రకారం మిగతా వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ట్రిబ్యునల్ తీర్పుపై అప్పీల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. హై కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను 8 ఫిబ్రవరి 2011న డిస్మిస్ చేసింది.

దీంతో ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను వేయగా ఎస్ఎల్పీని కొట్టివేసింది. సుప్రింకోర్టులో ప్రభుత్వం వేసిన ఎస్‌ఎల్‌పీని కొట్టివేయడంతో రాంగోపాల్ రావు, ఎన్నంపల్లి గంగాధర్ అడ్వకేట్లు హైకోర్టును ఆశ్రయించి నిర్వాసిత కుటుంబాలైన 144 మంది తమ క్లైంట్లకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. జీఓ 98 ద్వారా నిర్వాసితులకు 50 శాతం ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. ప్రభుత్వం తరుపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ 30 ఏళ్ల తరువాత ఉద్యోగాలు ఇప్పించాలని కోరుతున్నారని, ఇప్పటికే వారు పరిహారం కూడా పొందారని వాదించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు నిర్వాసితులు దరఖాస్తు చేసుకోవడంలో జాప్యం చేశారన్న కారణంతో తిరస్కరించవద్దని ఆదేశించింది. 98 జీఓ ప్రకారం 144 మంది నిర్వాసితులకు లస్కర్ లేదా సమానమైన ఉద్యోగాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఏదేమైనా నాలుగున్నర దశాబ్దాల పాటు న్యాయం పోరాటం చేసి 144 మంది నిర్వాసితులు ప్రభుత్వం నుండి ఉద్యోగాలు సాధించుకోగలిగారు.


Next Story

Most Viewed