111జీవో రద్దు.. హామీకే పరిమితమా!

by  |
111జీవో రద్దు.. హామీకే పరిమితమా!
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం జీవో 131తో అక్రమంగా నిర్మించిన లే అవుట్లను క్రమబద్దీకరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ 111 జీవో పరిధిలోని లే అవుట్లకు ఎల్ఆర్ఎస్‌కు అనుమతి ఇవ్వబోమని చెప్పడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందు 111 జీవో రద్దు చేస్తామని చెప్పిన అధికార పక్షం ఇప్పుడు అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మహానగరవాసులకు తాగునీరు సరఫరా చేసేందుకు ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్ సాగర్ జలశయాలను ఆనాటి నిజాం ఏర్పాటు చేశారు. ఈ జలశయాల్లోని నీరు కలుషితం కాకుండా ఉండేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీవో పరిధిలోకి 84 గ్రామాలను చేర్చారు. ఆయా ప్రాంతంల్లో లేఅవుట్లు, నిర్మాణాలు, పరిశ్రమలు ఏర్పాటు చేయొవద్దని ప్రభుత్వ నిబంధనలో పొందుపర్చింది. ప్రస్తుతం ఈ 84 గ్రామాల్లో సుమారుగా 4వేలకు పైగా లేఅవుట్లు, వెంచర్లున్నాయి. మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, షాబాద్, కొత్తురు వంటి మండలాలు నగరానికి సమీపంలోనే ఉండటంతో చాలా మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో షాక్ తగిలినట్లయింది.

కొనుగోలుదారుల్లో కంగారు..

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని 84 గ్రామాలు 111 జీవో పరిధిలో ఉన్నాయి. వీటి పరిధిలో కొనులుగోలు చేసిన ప్లాట్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వబోమని చెబుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. కనీసం ఇప్పటి వరకు తీసుకున్న ప్లాట్లకైనా ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందో లేదోనని టెన్షన్ పడుతున్నారు. ఎల్ఆర్ఎస్ లేకపోతే రిజిస్ట్రేషన్లు కావని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు కంగారు పడుతున్నారు.

పరిష్కరిస్తారా..?

రంగారెడ్డి జిల్లాలోని 111 జీవో ఎన్నికల హామీకే పరిమితం కానుందా.. లేక సమస్యను పరిష్కరించనున్నారా అనే అనుమానం ప్రజల్లో బలంగా ఉంది. ఎందుకంటే జనాభా పెరుగుతున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితిలో ఈ జీవో పరిధిలో కూడా అక్రమంగా ఇండ్లు నిర్మించారు. పేద, మధ్య తరగతి కుటుంబాలు చాల వరకు ఇండ్లు నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

111 జీవోతో పేదలకు అన్యాయం..

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్, చేవెళ్ల ప్రాంతాల్లో 111 జీవో అమలులో ఉంది. జనాభా పెరుగుతున్న దృష్ట్య లేఅవుట్లు, నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ ఆ నిర్మాణాలు చేస్తున్న అధికార పార్టీకి ఒకలా, సామాన్యులకు మరోలా నిబంధనలు ఉంటున్నాయి. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టే అధికార పార్టీ నేతలకు చట్టలుండవ్. వాళ్లు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారు. పేదల అభివృద్ధిని అణిచివేస్తున్నారు. 111 జీవో ఎత్తివేస్తామని మాయ మాటలతో ఎన్నికల్లో గెలిచి ప్రజలను మోసం చేశారు. -చల్లా నర్సింహారెడ్డి, డీసీసీ అధ్యక్షులు

ఎన్నికల హామీ ఏమైంది..?

చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అధికారంలోకి వస్తే 111 జీవో ఎత్తివేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ హామీని ప్రభుత్వం తుంగలో తొక్కింది. గత 15 రోజులుగా ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. స్ధానిక ఎమ్మెల్యేలు స్పందచకపోవడం దారుణం. 111 జీవో ఎత్తివేసే వరకు మా పోరాటం ఆగదు. పేద, మధ్య తరగతి ప్రజలకు న్యాయం జరగాలంటే 111 జీవో ఎత్తివేయాల్సిందే. -బొక్క నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు



Next Story