సింధు ముందుకు.. కశ్యప్, శ్రీకాంత్ బయటకు

by  |
సింధు ముందుకు.. కశ్యప్, శ్రీకాంత్ బయటకు
X

దిశ, స్పోర్ట్స్ :టోక్యో ఒలంపిక్స్‌లో బెర్త్ కోసం ప్రయత్నిస్తున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లకు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం దక్కలేదు. బుధవారం బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమైన టోర్నీలో ఓడిపోయిన స్టార్ ప్లేయర్లు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. తొలి రౌండ్‌లో జపాన్‌కు చెందిన కెంటో మొమోతపై 13-21, 20-22 తేడాతో పారుపల్లి కశ్యప్ ఓడిపోయాడు. ఈ మ్యాచ్ కేవలం 45 నిమిషాల్లో ముగిసింది. టోక్యో బెర్త్ కోసం ఆశపడుతున్న కశ్యప్‌కు ఈ ఓటమి పెద్ద ఎదురుదెబ్బే.

మరో స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ కూడా తొలి రౌండ్‌లో వెనుదిరిగాడు. ఐర్లాండ్‌కు చెందిన నాట్ గుయేన్‌పై 11-21, 21-15, 12-21 తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. పురుషుల డబుల్స్‌లో అర్జున్, ధృవ్ కపిల జోడి మలేషియాకు చెందిన యో సిన్, ఈ యేపై 13-21, 12-21 తేడాతో ఓడిపోయారు.

మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 21-11, 21-17 తేడాతో మలేషియాకు చెందిన సోనిలా చేహాపై గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జోడి థాయిలాండ్‌కు చెందిన బెన్యప, నంతకమ్ జోడీపై 21-14, 21-12 తేడాతో విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో సాత్వీక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.


Next Story

Most Viewed