అమెరికాలో జైళ్లకు పాకిన కరోనా.. ఆందోళనలో ఖైదీలు

by  |
అమెరికాలో జైళ్లకు పాకిన కరోనా.. ఆందోళనలో ఖైదీలు
X

వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. చైనాలో పుట్టిన కోవిడ్ -19 అమెరికాలో భారీ ప్రాణ నష్టాన్ని కలిగిస్తోంది. దేశమంతటా కరోనా వైరస్ వ్యాపించడంతో అక్కడి జైళ్లలో ఉంటున్న ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 2700 మంది ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా దాదాపు 2 వేల మంది కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా జైళ్లలో ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా 70 శాతం మంది పాజిటివ్‌గా తేలినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజనర్స్ వెల్లడించింది. అమెరికాలోని అన్ని జైళ్లలో కలిపి ప్రస్తుతం 1 లక్ష 50 వేల మంది ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. కరోనా వ్యాప్తి అనంతరం జైళ్లలో కూడా భౌతిక దూరం నియమాలను అమలు చేస్తున్నా సరే వాళ్లు కరోనా బారిన పడుతున్నారు. దీంతో వారి ఆరోగ్యంపై న్యాయవాదులు, చట్ట సభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా జైళ్లలోని పరిస్థితులు అంతగా బాగా లేవని, బుధవారం ఒక్క రోజే 31 మంది ఖైదీలో కరోనాతో మరణించడం దీనికి నిదర్శనమని పలువురు ఆరోపిస్తున్నారు. వెంటనే ఖైదీల ఆరోగ్యంపై నివేదిక విడుదల చేయాలని, వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్న మైఖేల్ అనే ఖైదీ కరోనా బారిన పడి మరణించే వరకు జైలు అధికారులు కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కనీసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా తమకు సమాచారం ఇవ్వలేదని మైఖేల్ కుమారుడు ఫ్లెమింగ్ ఒక మీడియా సంస్థకు తెలిపారు. కేవలం టీవీలో వచ్చిన సమాచారం ఆధారంగా మా తండ్రి చనిపోయినట్లు తెలుసుకున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఒక్క ఉదాహరణతో జైలు పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం అవుతుందని న్యాయవాదులు అంటున్నారు. మరోవైపు ఖైదీల కుటుంబ సభ్యులు, న్యాయవాదులు చేస్తున్న ఆరోపణలను జైళ్ల శాఖ అధికారులు తోసిపుచ్చుతున్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఆదేశాలను తాము కచ్చితంగా పాటిస్తున్నామని చెబుతున్నారు. సీడీసీ బృందాలు కూడా జైళ్లను సందర్శించి వైరస్ కట్టడికి సూచనలు చేశాయని అంటున్నారు. ఖైదీల మధ్య భౌతిక దూరం కచ్చితంగా అమలు చేస్తున్నామని.. కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని ఐసోలేట్ చేస్తున్నామని జైలు అధికారులు చెబుతున్నారు. కాగా, తీవ్ర నేరాల్లో కాకుండా ఇతర నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను సత్ప్రవర్తన చూసి విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. జైలులో కంటే ఇంటి వద్ద ఉంటే వారి ఆరోగ్యానికి రక్షణ ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే ఫెడరల్ ప్రభుత్వం ఇంకా ఖైదీల విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Tags : Covid 19, Coronavirus, CDC, Jails, Prisons, FDP, Prisoners, Lawyers

Next Story

Most Viewed