కబళిస్తోన్న కల్తీ కల్లు..

by  |
కబళిస్తోన్న కల్తీ కల్లు..
X

దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ (కోవిడ్ -19) మహమ్మారి భయంతో భారత్ సహా ప్రపంచమంతా వణికోపోతోంది. ఈ వైరస్ కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటిచింది. అయితే, ఈ మహమ్మారి కాకుండా తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొన్ని చోట్ల కల్తీ కల్లు (రసాయన మత్తు పదార్థాలతో తయారు చేసినది) జనాలను భయపెడుతోంది. ఇప్పటికే కొందరిని కబళించింది. ఇంకా భయపెడుతోంది. లాక్ డౌన్ సందర్భంగా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. కాని జిల్లా పరిధిలోని అక్కడక్కడ గ్రామాల్లో కృత్రిమ కల్లు తయారీ కొనసాగుతోన్నట్టు తెలుస్తోంది. ఈ కల్లుకు బానిసైన వారు అక్కడకెళ్లి తాగుతున్నట్టు సమాచారం.

అబ్కారీ శాఖ నిర్లక్ష్యం!

ఉమ్మడి జిల్లాపై కల్తీ కల్లు తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్ డౌన్ ఉన్నప్పటికీ ఇప్పుడు గ్రామం, సిటీ అని తేడా లేకుండా అంతటా దీనికి తీవ్ర డిమాండ్ ఏర్పడుతోంది. ఈ కల్తీ కల్లు నియంత్రణను అబ్కారీ శాఖ సీరియస్‌గా తీసుకోలేదనీ, అందుకే ఇప్పుడు కొన్ని గ్రామాల్లో కల్లు బట్టీలు తెరుచుకుంటున్నాయని పలువురు అంటున్నారు. జిల్లాలో కొన్ని చోట్ల రహస్యంగా ఈ విక్రయాలు జరుగుతున్నట్టు సమాచారం. అయితే, ఈ కల్లుకు బానిసైన వారు అది దొరకకపోతే పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. వారికి ఫిట్స్ కూడా వస్తోందని వారి కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇలా బానిసలై ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్న సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొంత మంది ప్రాణాలూ కోల్పోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజుకో చోట ఇటువంటి ఘటనలు వెలుగు చూస్తునే ఉన్నాయి.

కల్లు బాధితులకు ప్రత్యేక వార్డులు..

నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కల్లు బాధితులకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి చికిత్స చేస్తున్నారు. అయితే, బాధితుల ఆరోగ్యం అప్పటికే పూర్తిగా క్షీణ దశలో ఉంటోందని కొందరు అంటుండగా, కేవలం ప్రాథమిక చికిత్స చేస్తున్నారనీ, పూర్తి స్థాయి వైద్యం అందించడం లేదని బాధితుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

రెండ్రోజుల్లో ముగ్గురి మృతి..

శుక్రవారం నిజామాబాద్ నగరంలోని త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన శంకర్(65) సర్కార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. శంకర్ రెండ్రోజుల కిందట కల్లు కావాలంటూ ఆందోళన చేసి రోడ్డుపై పడ్డాడు. అటుగా వచ్చిన వారు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగా ప్రాణం పోయింది. అయితే, శంకర్ చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే వ్యక్తని తెలిసింది.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పరిధిలోని సాయినగర్-3కి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య భార్య శకుంతల(60). శనివారం తెల్లవారు జామున శకుంతల ఇంట్లోనే యాసిడ్ తాగింది. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే, శకుంతల నిత్యం కల్లు తాగేదనీ, కాని అది దొరక్కపోవడంతో నాలుగు రోజుల నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తోందని సత్తయ్య చెప్పారు. శనివారం తెల్లవారు జామున పినాయిల్ తాగిందని తెలిపారు.

నిజామాబాద్ సిటీలోని వన్ టౌన్ పోలిస్ స్టేషన్ పరిధిలోని బోనగిరి భూషన్(44) స్థానికంగా కూలీ పనులు చేసుకుని కుటుంబ పోషణ చేసుకునేవాడు. ఈయన కొద్ది రోజుల కిందట నగరంలోని విక్లీ మార్కెట్ కల్లుబట్టిలో రోజు కూలీగా చేరాడు. దాంతో అక్కడ నిత్యం కల్లు తాగేవాడు. లాక్ డౌన్ నేపథ్యంలో 4 రోజుల నుంచి కల్లు దొరకలేదు. భూషణ్‌కు శుక్రవారం రాత్రి ఫిట్స్ వచ్చింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు.

కల్లు బాధితులకు అందని వైద్యం..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రెండు ఆస్పత్రుల్లో కేవలం కౌన్సెలింగ్, ప్రాథమిక చికిత్స చేస్తున్నారు. కల్లు బాధితులకు సరైన వైద్యం అందడం లేదు. ప్రస్తుతం అంతా కోవిడ్ -19 అనుమానితుల అలర్ట్ ఉండటంతో ఆస్పత్రుల్లో వారికే ప్రాధాన్యమిస్తోన్నారు. వేరే వైద్యం కోసం వచ్చిన వారు (కల్లు బాధితులూ) వాళ్లందరూ ప్రైవేటు ఆస్పత్రలు ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే, లాక్ డౌన్ కారణంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ సిబ్బంది కొరత ఉంది. దాంతో ఉన్న వాళ్లే కొంత ట్రీట్ మెంట్ చేస్తున్నారు. అది సరిపోవడం లేదు. పేదలు, కూలి నాలి చేసుకుని కల్లు మత్తుకు అలవాటు పడ్డ బాధితులను ఇటు ప్రభుత్వ ఆస్పత్రులు, అటు ప్రైవేటు ఆస్పత్రులు పట్టించుకోవడం లేదని బాధితుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

నిజామాబాద్ లోనే 400 సొసైటీలు..

గ్రామాల్లో కల్లు అమ్మకాలు గ్రామస్తుల తీర్మానం మేరకే సాగుతున్నాయని అమ్మకం దారులు చెబుతున్నారు. అయితే, రసాయనాలతో ప్రజలకు హాని చేసే ఈ కల్తీ కల్లు తయారీ గురించి తెలిసినా అబ్కారీ శాఖ ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలో 400 కల్లు సొసైటీలు ఉంటే కనీసం పదింటినైనా అబ్కారీ శాఖ సీజ్ చేయడం లేదు. తద్వారా అబ్కారీ శాఖ నిర్లక్ష్య వైఖరి స్పష్టమవుతోంది.



Next Story

Most Viewed