హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే: అదనపు ఈవో ధర్మారెడ్డి

by  |
హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే: అదనపు ఈవో ధర్మారెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో: హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రేనని టీటీడీ మరోసారి పునరుద్ఘాటించింది. హనుమాన్ జన్మస్థలంపై టీటీడీ శనివారం అదనపు ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రేనని పండితులు తేల్చి చెప్పారని గుర్తు చేశారు. తమకు లభించిన ఆధారాలు, శాసనాల ప్రకారమే ఆ ప్రకటన చేసినట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. అంజనాద్రే హనుమ జన్మస్థలంగా నిర్ధారించేందుకు పండిత పరిషత్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంస్కృతం, పురాణాలు తెలియనివాళ్లకు మాట్లాడేహక్కు లేదని మండిపడ్డారు.

ఎవరి దగ్గరైనా ఆధారాలుంటే తమతో చర్చకు రావొచ్చని అదనపు ఈవో తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో అంజనాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని.. అబద్ధాలను చెప్పాల్సిన అవసరం తమకు లేదని ధర్మారెడ్డి తెలిపారు. హనుమంతుడి జన్మస్థలంపై రెండు రోజులపాటు అంతర్జాతీయ వెబినార్ నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ వెబినార్‌లో పండితులు, పీఠాధిపతులు పాల్గొంటారని తెలిపారు. మరోవైపు హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రేనని నిరూపించేందుకు తగిన ఆధారాలతో కూడిన పుస్తకాన్ని కూడా విడుదల చేయబోతున్నట్లు అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.


Next Story

Most Viewed