కేన్సర్‌తో యువ నటుడు మృతి

by  |
కేన్సర్‌తో యువ నటుడు మృతి
X

బాలీవుడ్‌లో వరస మరణాలు బీటౌన్ నటీనటుల హృదయాలను కలిచివేస్తున్నాయి. మొదట ఇర్ఫాన్ ఖాన్, ఆ తర్వాత రిషి కపూర్ కేన్సర్‌తో మరణించగా.. ఇప్పుడు యువ నటుడు మోహిత్ బఘేల్ కేన్సర్‌తో పోరాడి చనిపోయారు. మోహిత్ మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

రియాలిటీ షో ‘చోటే మియాన్‌’తో తన కెరీర్‌ ప్రారంభించిన మోహిత్‌.. 2011లో విడుదలైన సల్మాన్‌ ఖాన్‌ ‘రెడీ’ చిత్రంలో అమర్‌ చౌదరి పాత్రలో నటించారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సిద్దార్థ్‌ మల్హోత్రా, పరిణీతి చోప్రా జంటగా నటించిన ‘జబారియా జోడి చిత్రంతో పాటు, గలీ గలీ చోర్ హై’ సినిమాల్లోనూ మోహిత్‌ నటించారు. ఆరు నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న మోహిత్‌.. ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, 26 ఏళ్ల మోహిత్‌.. తన స్వస్థలం మథురలోని స్వగృహంలోనే శనివారం తుదిశ్వాస విడిచారు.

మోహిత్‌ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని ప్రముఖ రచయిత రాజ్ శాండిల్య అన్నారు. మోహిత్‌తో ఆయన ‘రాజ్ కామెడీ సర్కస్, జబారియా జోడీ’లకు కలిసి పని చేశారు. రాజ్ తను దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిన డ్రీమ్ గర్ల్ సినిమాలోనూ మోహిత్ తీసుకుందామనుకున్నానని, కానీ డేట్లు సర్దుబాటు కాకపోవడంతో.. ఆ సినిమాలో చేయలేకపోయాడని రాజ్ అన్నారు. ‘గొప్ప సహనటుడిని కోల్పోయాం. లవ్‌ యూ మోహిత్‌.. ఆర్‌ఐపీ’ అని నటి పరిణీతి చోప్రా పేర్కొన్నారు.

Next Story