పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలు: చెవిరెడ్డి

by  |
పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలు: చెవిరెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మనమంతా విధేయులం. మనమంతా కుటుంబ సభ్యులుగా మెలుగుదాం. కార్యకర్తల సంక్షేమం నా బాధ్యతంటూ కార్యకర్తలతో ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగిట్టిగల్లు, ఎర్రవారిపాలెం మండలాల కార్యకర్తలతో ఆదివారం తిరుపతిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ… కాలేజీలో చదువుకునేటప్పటి నుంచి తనకు వైఎస్సార్ కుటుంబంతో అనుబంధం ఉందన్నారు. ఆ కుటుంబంతో ముప్పై సంవత్సరాలుగా విధేయతగా ప్రయాణిస్తున్నానని తెలిపారు.

ఆ స్థాయిలో మన అనుబంధం కలిగి ఉండాలని ఆకాంక్షించారు. పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని కొనియాడారు. ప్రతీ కార్యకర్త సంక్షేమం తన బాధ్యతన్నారు. ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని చెప్పారు. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలంటే తనకు అంతులేని గౌరవమన్నారు. ప్రజా పాలనకు తన జీవితం అంకితమని స్పష్టం చేశారు. తన సంపాదనలో 75 శాతం ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తానన్నారు. 25 శాతం మాత్రమే తన కుటుంబానికి వెచ్చిస్తానని తెలిపారు.

పార్టీలో కొనసాగే ప్రతి కార్యకర్తకూ సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీకి విధేయంగా ఉండే కార్యకర్తలు పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు. ఆప్పుడే పార్టీకి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కరోనా కష్టకాలంలో కార్యకర్తలంతా ఒక్కటై ప్రజలను ఆదుకున్న తీరును అభినందించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో కార్యకర్తలు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెవిరెడ్డి కోరారు.

Next Story