‘రోడ్డును ఆక్రమించిన వారిపై చ‌ర్యలు తీసుకోవాలి’

by  |
DYFI protest
X

దిశ‌, కాళోజీ జంక్షన్ : హంటర్ రోడ్డు నుంచి విష్ణుప్రియ గార్డెన్‌కు వెళ్లే దారిలో (నీలిమ టవర్స్) మూల మీద గల రోడ్డును విస్తరణ చేయాలని కోరుతూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గేల తిరుపతి మాట్లాడుతూ.. కుడా ప్లాన్ (డీపీ నెంబర్ 27/86) ప్రకారం 80 ఫీట్ల రోడ్డు మంజూరు అయితే మూల మీద మాత్రం రోడ్డు 60 ఫీట్లు ఉందన్నారు. అయితే ప్లాన్‌లో ఉన్నవిధంగా కాకుండా రోడ్డు వంకరగా ఉందని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న డ్రైనేజీ కాలువలు చాలా చిన్నవిగా ఉండటం వల్ల వర్షం వస్తే నీరు మొత్తం రోడ్డుమీదికి చేరుకొని చెరువులా మారి ప్రజలు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు.

వర్షం నీరు మొత్తం ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మూల మీద రోడ్డు చిన్నగా ఉండడం వల్ల నిత్యం వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు విస్తరణ చేయాలని, గతంలో వినతి పత్రం ఇచ్చినా అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన టౌన్‌ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రోడ్డు ఆక్రమణకు గురైందని, దాని మీద విచారణ జరిపి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని తిరుపతి కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు గణేష్, వినయ్, రమేష్, రాజు, కుమార్, మహేష్, రాజు, శ్రీకాంత్, సురేష్, సాయిలు పాల్గొన్నారు.



Next Story