'ఈటలకు ఒక న్యాయం.. రామోజీరావుకు మరొక న్యాయమా..?'

by  |
political news
X

దిశ, ఖైరతాబాద్ : అసైన్డ్ భూముల్లో రామోజీ ఫిలిం సిటీ చేసిన అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ రహదారి ఆక్రమణ, పేదలకు కేటాయించిన స్థలాలోకి వారిని అనుమతించక పోవడం వంటి వాటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రామోజీ అక్రమాలపై విచారణ జరిపించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామోజీ ఫిలిం సిటీ యజమాని రామోజీరావు దాదాపు పదిహేడు వందల ఎకరాల్లో రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం చేశారని, ఇందులో వందలాది ఎకరాలు పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములు, చెరువులు, కుంటలు ఉన్నాయని ఆరోపించారు.

అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం వాటిలో నిర్మాణాలు చేపట్టడం చట్టరీత్యా నేరమని, రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, నాగన్న పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 189,203 లో 14 ఎకరాల 30 గుంటల భూమిని 2008 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 606 ఇళ్ల పట్టాలను, అక్కడి చుట్టుపక్కల గ్రామాలలో నివసిస్తున్న 150 మంది పేదలకు కేటాయించారని అన్నారు. ఇట్టి భూములలోకి వారిని రాకుండా రామోజీ ఫిలింసిటీ యాజమాన్యం అడ్డుకుంటుందని తెలిపారు. అంతేకాకుండా ఆ స్థలంలో రహదారులు మూసివేసి స్టూడియోల నిర్మాణాన్ని చేపట్టిందని, దీని వలన అక్కడ చుట్టుపక్క గ్రామ వాసులు తమ నివాసాలకు వెళ్లాలంటే పదకొండు కిలోమీటర్లు ఎక్కువగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ విషయంపై అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ని సంప్రదించగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో దర్యాప్తు జరిపి, 2017 కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నివేదికను సమర్పించారని తెలిపారు. ఈ నివేదికలో పేదలకు కేటాయించ భూముల లోకి రామోజీ ఫిలింసిటీ యాజమాన్యం వారిని అనుమతించడం లేదని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు.

ప్రజల ఉపయోగార్ధం నిర్మించిన రహదారిని మూసివేయడం చాలా నేరమని, ఈ విషయంలో రామోజీరావును 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి రాష్ట్రపతి సైతం రక్షించాలి అని స్పష్టం చేశారు. తాను చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఏ వేదిక పైన దీనిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తన ఆరోపణలు తప్పని ఇరవై నాలుగు రోజులలో రామోజీరావు, ముఖ్యమంత్రి కేసీఆర్ లు నిరూపించగలిగితే దేశం విడిచి వెళ్ళిపోతాను అంటూ సవాల్ విసిరారు. ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఈటెల రాజేందర్ పై ఆగమేఘాల మీద విచారణ జరిపిన ముఖ్యమంత్రికి రామోజీ ఆక్రమణలో కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. ఈటల రాజేందర్ కు ఒక న్యాయం.. రామోజీరావు కు మరొక న్యాయమా అంటూ ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో లక్ష నాగలితో దున్నిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇంచు కూడా అక్రమం కాదు అంటూ వ్యాఖ్యలు చేయడం విచారకరమని అన్నారు. తన ఆరోపణలపై విచారణ ప్రారంభించక పోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు



Next Story

Most Viewed