ఇదెక్కడి విచిత్రం.. పంచాయతీ ఫండ్స్‌ కోసం వేలం పాటనా..?

by  |
ఇదెక్కడి విచిత్రం.. పంచాయతీ ఫండ్స్‌ కోసం వేలం పాటనా..?
X

దిశ, ఖమ్మం రూరల్​ : అక్కడ పంచాయతీ నిధులకు స్థానిక రాజకీయ పార్టీల నాయకులందరూ కలిసి వేలం పాట నిర్వహించారంటే నమ్మశక్యంగా లేదా.. ఇదే నిజం. ఖమ్మం జిల్లాకు కూత వేటు దూరంలో ఉన్న రూరల్​ మండలం గుర్రలపాడు పంచాయతీలో ఆలస్యంగా వెలుగుచూసింది. 2018 జనరల్​ ఎన్నికలకు ముందు రూరల్​ మండలంలోని ఐదు పంచాయతీలను కార్పొరేషన్​లో కలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తర్వాత వచ్చిన పంచాయతీ ఎన్నికలకు ఈ ఐదు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. తరువాత స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి కృషితో కార్పొరేషన్‌లో కలిసిన ఐదు విలీన పంచాయతీలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తిస్తున్నట్టు ప్రభుత్వం గెజిట్​ జారీ చేసింది. ఈ ఐదు పంచాయతీలకు కలెక్టర్​ స్పెషల్​ అఫీసర్లను నియమించారు. పంచాయతీల్లో ఉన్న ఫండ్స్​తో అభివృద్ధి పనులు నిర్వహించేందుకు వీడీసీ తీర్మానాల అవసరం ఉంది.

గుర్రలపాడు పంచాయతీలో రూ.59 లక్షల వరకు ఫండ్స్​ ఉన్నాయి. వీటికి అధికారులు ఎక్కడ ఏ పనులు చేయాలో అంచనాలు తయారు చేసి సిద్ధంగా ఉంచారు. ఈ గ్రామానికి చెందిన రాజకీయ పార్టీల నాయకులు కొందరు డ్రామాలు చేసి అట్టి ఫండ్స్​కు వేలం పాట ఏర్పాటు చేసి రూ.7.90 లక్షలకు అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి కట్టబెట్టారు. ఇదేమిటి అంటే గ్రామంలో నిర్మాణంలో పెండింగ్​లో ఉన్న ఆలయ అభివృద్ధి కోసమని చెప్పడం విడ్డురంగా లేదు మరి. అంతగా అతనికి దేవుని మీద భక్తి ఉంటే సొంతంగా ఇచ్చే అవకాశం ఉంది. కానీ పంచాయతీ ఫండ్స్​ వేలంలో దక్కించుకుని దానికి దేవుడి పేరు చెప్పడం.. ఇదెక్కడి న్యాయమని ప్రజలు ఫైర్ అవుతున్నారు. అధికారులకు పంచాయతీలో ఏకాభిప్రాయం కుదరకపోతే ఆన్​లైన్​ టెండర్​ నిర్వహించాలే తప్పా.. ఇలా అధికారులు వేలం పాటను పరోక్షంగా ప్రొత్సహించడం వెనుక అసలు కథ అర్థం కావడం లేదు. ఆన్​లైన్​ టెండర్​ నిర్వహించడం వలన పంచాయతీకి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పంచాయతీ ఫండ్స్​ వేలం వెనుక ఉన్న అధికారులు ఎవరో…నిగ్గుతేల్చి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని.. వేలం పాటను రద్ధు చేసి తగు ఆన్​లైన్​ టెండర్​ నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.


Next Story

Most Viewed