ఉత్తమ్‌పై ‘కారు’ కూత‌లు.!

by  |
ఉత్తమ్‌పై ‘కారు’ కూత‌లు.!
X

– స‌హ‌కార ఎన్నిక‌ల్లో క‌నిపించ‌ని ఉత్తమ్

స‌హ‌కార‌ ఎన్నికలు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి స‌వాల్‌గా మారాయి. ఉత్తమ్ ఇలాఖాలోని హుజూర్‌న‌గ‌ర్‌, కోదాడ‌, సూర్యాపేట‌ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు టీఆర్‌ఎస్‌లోకి జారిపోకుండా కాపాడుకునేందుకు కాంగ్రెస్ వర్గాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అయినా టీఆర్ఎస్ ప్రలోభాలను ఎదుర్కోలేక చేష్టలుడిగి చూస్తున్నారు. దీంతో ఈ సహకార ఎన్నికల్లో కారు స్పీడును కాంగ్రెస్ తట్టుకుంటుందా ? అన్న చ‌ర్చ రాజ‌కీయంగా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. నేర‌డుచ‌ర్ల పుర పీఠం కోసం ఢిల్లీ ఎల‌క్షన్ క‌మిటీతో కొట్లాడి మరీ ‘కేవీపీ రాంచంద‌ర్‌రావు’ ఓటును ఓకే చేయించినా.. చైర్మెన్ ప‌ద‌వి ద‌క్కక‌పోవ‌డంతో ఉత్తమ్ నిరాశ చెందిన‌ట్టు సమాచారం. అందుకే ఉత్తమ్ లైట్ తీసుకున్నారని అనుచ‌రులు చెబుతుండ‌గా.. గులాబీ జోరుకు భ‌య‌ప‌డే ఉత్తమ్ ముఖం చాటేశాడ‌ని స్థానిక టీఆర్ఎస్ నాయకులు కారు కూత‌లు కూస్తున్నారు.

సూర్యాపేట మునిసిపాలిటీలో 48 వార్డులు ఉండగా.. కాంగ్రెస్‌ పార్టీ 15 వార్డులు గెలుచుకుంది. నేరేడుచర్లలో 15 వార్డులు ఉంటే మిత్రపక్ష సీపీఐ(ఎం)తో కలిసి 8 వార్డులు గెలుచుకున్నా ఎక్స్‌అఫీషియో సభ్యులతో టీఆర్‌ఎస్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ పదవులను దక్కించుకుంది. సహకార ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అదే దూకుడును ప్రదర్శిస్తుండటంతో కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకోవడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. తాజాగా మఠంపల్లి మండలం కాంగ్రెస్‌ పార్టీ పీఏసీఎస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ఉన్న నలబోలు వెంకట్‌రెడ్డి, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. గ‌డ్డిప‌ల్లి సొసైటీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి భద్రయ్య చివ‌రి నిమిషంలో కారెక్కి ఏకగ్రీవంగా డైరెక్టర్‌గా ఎన్నిక‌య్యారు. ఇలా జిల్లాలోని 47 సహకార సంఘాల్లో 608 మంది డైరెక్టర్ల స్థానాలకు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో 10 సొసైటీలు ఏకగ్రీవ‌మైనాయి.

ఇటీవల జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో సూర్యాపేట మునిసిపాలిటీలో పలువురు కాంగ్రెస్‌ అభ్యర్థులు బీ ఫాంలు పొందిన తర్వాత కొందరు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీకి నష్టం వాటిల్లింది. దీంతో టీఆర్‌ఎస్‌ విజయానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం జరుగుతున్న స‌హ‌కార ఎన్నిక‌ల్లో సూర్యాపేట జిల్లాలో 47 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల పరిధిలో జిల్లా వ్యాప్తంగా 608 డైరెక్టర్‌ పదవులకు మొత్తం 2,169 నామినేషన్లు దాఖలు చేశారు. ఎక్కువగా గరిడేపల్లి మండలం రాయినిగూడెం పీఏసీఎస్‌ పరిధిలో 79, మునగాల మండలం తాడువాయి, గరిడేపల్లి మండలం సర్వారం పీఏసీఎస్‌ల పరిధిలో 68చొప్పున నామినేషన్లు వేసిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు చేజారిపోయారు. పార్టీ మ‌ద్దతు పొంది కూడా చివరి నిమిషంలో కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చారు. దీంతో జిల్లాలో 175 డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవ‌మైనాయి. ఇందులో 90 శాతం స్థానాల‌ను టీఆర్ఎస్ త‌న ఖాతాలో వేసుకుంది. ‘టీపీసీసీ చీఫ్ ఉత్తమ్’ ఇలాఖాలోనే ఇలాంటి ప‌రిస్థితి ఉంటే.. మిగ‌తా చోట్ల కాంగ్రెస్ ప‌రిస్థితి ఏమిటనేది అర్ధం చేసుకోవ‌చ్చు. అందుకే ఈ స‌హ‌కార ప‌ర‌ప‌తి సంఘం ఎన్నిక‌లు ఉత్తమ్ ప‌ర‌ప‌తిని నిల‌బెడతాయా? లేదా అన్నది కాంగ్రెస్ అభ్యర్థుల చేతుల్లోనే ఉంది.



Next Story

Most Viewed