మాట్లాడితే చీల్చి చెండాడుతా.. సీఎం జగన్‌కు మోపతయ్య వార్నింగ్

by  |
Acchampeta1
X

దిశ, అచ్చంపేట: తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ భిక్షతో ఎదిగి రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వల్లభనేని వంశీ, కోడలి నాని, ఎన్టీఆర్ కుటుంబంపై ఇష్టానుసారంగా మాట్లాడటం దుర్మార్గమని, మరోసారి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే తగిన బుద్ధి చెప్తామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, అచ్చంపేట నియోజకవర్గ ఇన్ చార్జ్ డాక్టర్ మోపతయ్య మండిపడ్డారు. ఆదివారం నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని లత్తీపూర్ గేట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

అనంతరం మోపతయ్య మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో సంచలన మార్పులు తీసుకొచ్చేలా, రాజకీయాలు చేసి సబ్బండ వర్గాలకు రాజకీయాల్లో అవకాశం కల్పించిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని, అనంతరం చంద్రబాబు నాయుడు సీఎంగా చరిత్రలో నిలిచిపోయేలా పాలన సాగించారని పేర్కొన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణమే కానీ, ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ నాయకులు ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణిపై ఇష్టానుసారంగా వ్యాఖ్యానించడం సరికాదని హెచ్చరించారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, కొడాలి నాని, వల్లభనేని వంశీ నిబంధనలకు విరుద్ధంగా, చట్టాలను సైతం లెక్కచేయకుండా ఇష్టానుసారంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అసెంబ్లీ సాక్షిగా మహిళలను సైతం దుర్భాషలాడటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.

వైసీపీ నేతలు అధికార దురహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా మాట్లాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. మరోసారి ఎన్టీఆర్ కుటుంబం గురించి వైసీపీ నేతలు అవాకులు, చెవాకులు పేల్చితే, చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, కొడాలి నానిని సీఎం జగన్మోహన్ రెడ్డి అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. నోరు అదుపులో పెట్టుకోకుండా నాలుక ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప్పునుంతల మండల అధ్యక్షుడు కాశన్న, ప్రధాన కార్యదర్శి విష్ణు, టీడీపీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తిమ్మయ్య, నాయకులు పరమేష్ గౌడ్, బాలకృష్ణ, మాసయ్య, విజయ్, మహేష్, అంజి, శ్రీనివాస్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Next Story