ఓటుకు నోటు కేసులో కోర్టుకు హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు

by  |
revanth reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఓటుకు నోటు కేసులో నిందితుడు రేవంత్‌రెడ్డితో సహా ఉదయసింహా, సెబాస్టియన్ తదితరులు ఏసీబీ కోర్టులో జరిగిన విచారణకు శుక్రవారం హాజరయ్యారు. వీరితో పాటు పలువురు ప్రత్యక్ష సాక్షులు, అసెంబ్లీ మాజీ కార్యదర్శి రాజా సదారాం, ఒక ప్రభుత్వ టీచర్ వాంగ్మూలాలను కూడా కోర్టు సేకరించింది. ఒక రోజు ముందు జరిగిన విచారణకు వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్ కూడా హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చారు. రేవంత్‌రెడ్డికి అప్పట్లో వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సైదయ్య వాంగ్మూలాన్ని కూడా కోర్టు తీసుకున్నది.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 2015లో నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభాలకు గురిచేసి రూ. 50 లక్షల నగదు ఇస్తూ పట్టుబడిన కేసులో రేవంత్ సహా పలువురిని ఏసీబీ నిందితులుగా చేర్చింది. ఆరున్నరేళ్ళుగా విచారణ జరుగుతూ ఉన్న ఈ కేసులో సెప్టెంబరు 6వ తేదీ నుంచి సాక్షులను విచారించి వారి నుంచి వాంగ్మూలాన్ని తీసుకోనున్నది. ఈ వ్యవహారంలో అప్పటి అసెంబ్లీ కార్యదర్శిగా వ్యవహరించిన రాజా సదారాం నుంచి కూడా ఏసీబీ కోర్టు కొన్ని వివరాలను తీసుకున్నది. ఆయన చెప్పిన వివరాలన్నింటినీ వాంగ్మూలం రూపంలో కోర్టు నమోదు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు 6వ తేదీకి వాయిదా వేసింది.

Next Story