ఏసీల ధరలు పెరగనున్నాయ్.!

by  |
ఏసీల ధరలు పెరగనున్నాయ్.!
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి కాలం వచ్చేసింది. అప్పుడే ఎండలు భగభగమంటున్నాయి. దీనికితోడు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే ఉండటంతో, ఇంటి అవసరాలకు తగినట్టు వస్తువులు కొనేందుకు సిద్ధమవుతుంటారు. అయితే, సీజనల్ వస్తువైన ఎయిర్ కండీషనర్(ఏసీ) ధరలను పెంచడానికి కంపెనీలు రెడీ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏసీ ధరలను కంపెనీలు 5-8 శాతం వరకూ పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో ఈ ఏడాది రెండంకెల వృద్ధిని సాధించగలమని భావిస్తున్నాయి.

వోల్టాస్, ఎల్‌జీ, పానసోనిక్, బ్లూస్టార్, హైయర్, శాంసంగ్ కంపెనీలు ఇప్పటికే క్యాష్‌బ్యాక్, ఈఎంఐ ఆఫర్లను ప్రకటిస్తూ విక్రయాలను పెంచే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఈసారి ధరల పెరుగుదలకు ఏసీ తయారీలో వాడే కంప్రెసర్, మెటల్ ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యవయం పెరిగిందని, దీంతో ధరలను 6-8 శాతం వరకు పెంచనున్నట్టు పానాసోనిక్ తెలిపింది. ప్రిడ్జ్‌ల ధరలు కూడా 3-4 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని పానాసోనిక్ సీఈఓ మనీశ్ శర్మ చెప్పారు. టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన వోల్టాస్ ఇప్పటికే ధరలు పెంచిన సంగతి తెలిసిందే. బ్లూస్టార్ ఏసీ మోడల్‌ని బట్టి 5-8 శాతం మధ్య ధరలను పెంచింది. ఏప్రిల్ నుంచి అదనంగా మరో 3 శాతం పెంచేందుకు సిద్ధమవుతోంది. ముడి పరికరాల ధరల పెరుగుదలతో కంపెనీలకు ఉత్పత్తి వ్యవయం 10-12 శాతం మేర పెరిగిందని, ఈ కారణంగానే మార్కెట్లో ఏసీ ధరలు పెరుగుతున్నాయని పరిశ్రమల సంఘం సీఈఏఏంఏ వెల్లడించింది.


Next Story