బిపిన్ రావత్ ప్రస్థానం సాగిందిలా..

by  |
బిపిన్ రావత్ ప్రస్థానం సాగిందిలా..
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో జ‌రిగిన ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్రమాదంలో త్రివిధ ద‌ళాధిప‌తి బిపిన్ రావత్ కన్నుమూశారు. ఈ విష‌యాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. ఆయ‌నతో పాటు ప్ర‌యాణిస్తున్న మిగతా 13 మంది కూడా చ‌నిపోయారు. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఆయ‌న భార్య మ‌ధులిక రావ‌త్ కూడా మ‌ర‌ణించారు. ఈ ఘోర సంఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని విషాదంలో ముంచేసింది. కూనూరు సమీపంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. మృత‌దేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండ‌టంతో డీఎన్‌ఏ టెస్టులు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం భార‌త త్రివిధ ద‌ళాధిప‌తి హోదాలో ఉన్న బిపిన్ రావ‌త్ 1958 మార్చి 16వ తేదీన ఉత్త‌రాఖండ్ లో జ‌న్మించారు. సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ పాఠశాలలో, త‌ర్వాత కటక్‌లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నారు. మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. చెన్నై యూనివర్సిటీ నుంచి డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫిల్ పట్టా పొందారు. అంతే కాదు నేషనల్ డిఫెన్స్ కాలేజీ నుంచి వివిధ విభాగాల్లో పట్టభద్రుడయ్యారు. 1978 డిసెంబర్‌లో డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ లో పదకొండవ గూర్ఖా రైఫిల్స్ విభాగంలో చేరారు. ఐదవ రెజిమెంట్‌లో ర‌క్ష‌ణ రంగంలో త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. ఈయ‌న కుటుంబం కూడా చాలా ఏళ్లుగా దేశ ర‌క్ష‌ణ రంగంలో ప‌ని చేస్తోంది. ర‌క్ష‌ణ రంగంలో ప‌ని చేసిన కాలంలో ఆయ‌న పొంద‌ని ప‌త‌కం అంటూ లేదు.

డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్‌లో ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌తో సహా శిక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. సెంట్రల్ రీజియన్‌లో లాజిస్టిక్స్ డివిజన్ అధికారిగా పనిచేశారు. ఆర్మీ సెక్రటరీ విభాగంలో అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, సెక్రటరీ ఆఫ్ ఆర్మీగా కల్నల్ హోదాలో పనిచేశారు. అమెరికాలోని ఫోర్ట్ లీవెన్‌వర్త్‌లో సైనిక కమాండర్లకు ఇచ్చిన శిక్షణా తరగతులు హాజరయ్యారు. 2016 డిసెంబర్‌లో కమాండర్ ఇన్ చీఫ్‌గా నియమితులయ్యారు. జనరల్ బిపిన్ రావత్ 2020 జనవరిలో దేశానికి తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా నియమితులయ్యారు. దాదాపు 40 ఏళ్లుగా ఆయ‌న దేశ ర‌క్ష‌ణ కోసం ప‌ని చేస్తూనే ఉన్నారు. మ‌రోవైపు 2015లోనూ ఆయ‌న లెఫ్ట్ నెంట్ జ‌న‌ర‌ల్ గా ఉన్న‌ప్పుడు నాగాలాండ్ లో చీతా ఛాప‌ర్ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు.

తాజాగా తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ ప్ర‌మాదం జరిగిన తర్వాత ఆయ‌న‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రచారం జరిగింది. అయితే రావత్ సంఘటన స్థలంలోనే చనిపోయినట్టు వెల్లడైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అధికారి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అని భారత వాయుసేన ప్రకటించింది. రావ‌త్ తోపాటు మ‌రో 13 మంది మ‌ర‌ణంపై త్రివిధ ద‌ళాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశాయి. రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని, ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి స‌హా దేశంలోని రాజ‌కీయ, ఇత‌ర ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు.

Next Story

Most Viewed