‘పీకే’సిన కొద్దీ పాకేస్తడు!

by  |
‘పీకే’సిన కొద్దీ పాకేస్తడు!
X

ఎన్నికలు ఏవైనా, నాయకుడు ఎవరైనా ప్రజల్లో ఆయా పార్టీలు మైలేజీ పొందాలంటే పీకే అలియాస్ ప్రశాంత్‌కిషోర్ వ్యుహం ఉంటే చాలు. ఎలాగైనా అధికారంలోకి రావచ్చనే నమ్మకం. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా దానినే రుజువు చేశాయి. ‘ఆప్‘ వ్యూహకర్తగా వ్యవహరించి ఆ పార్టీకి విజయం సాధించి పెట్టాడు. అసలు ఎవరూ ఈ పీకే.. పుట్టింది బీహార్‌లోని రోహతక్ గ్రామం. చదివింది బీటెక్, పనిచేసింది అమెరికాలోని యూనిసెఫ్ ఫర్ పసిఫిక్ రీజియన్. 2011లో మోడీ ప్రభుత్వంలో వైబ్రంట్ గుజరాత్ ప్రమోషన్ బాధ్యతలు చూసేవాడు. అది కాస్త సూపర్ హిట్ అయ్యింది. కాగా, 2014 ముందు వరకు పీకే అంటే ఎవరికి తెలీదు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత అతడు అనతికాలంలోనే దేశమంతటా పాపులారిటీ సంపాదించాడు. పీకే అంత ఫేమస్ కావడానికి ఒకే ఒక్క కారణం పొలిటికల్ స్ట్రాటజీ(రాజకీయ వ్యుహం) అదొక్కటే అతన్నిదేశంలోని అన్ని ప్రాంతీయ, జాతీయ పార్టీలకు సుపరిచితున్ని చేసింది.

2011 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్రమోడీ సారథ్యంలోని బీజేపీ విజయానికి పీకే పొలిటికల్ స్ట్రాటజీ ఎంతగానో ఉపయోగపడిందని చెప్పవచ్చు. 2012లో వచ్చిన ఎన్నికల్లోనూ అతని వ్యుహం ఫలించింది. దీంతో 2013లో ప్రశాంత్‌కిషోర్ CAG (సిటిజన్ అకౌంటబుల్ ఫర్ గవర్నెన్స్) మీడియా అండ్ పబ్లిసిటీ టీమ్‌ను ఏర్పాటు చేశాడు. అప్పటికే బీజేపీ తమ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించింది. దీంతో పీకే తన టీం సభ్యులతో కలిసి మోడీ కోసం ‘ఛాయ్ పే చర్చా’ కార్యక్రమం నిర్వహించారు. అది కాస్తా ప్రజల్లోకి బాగా వెళ్లడం, అనంతరం 2014 మే నెలలో వచ్చిన జనరల్ ఎలక్షన్స్‌లో బీజేపీ అధికారంలోకి రావడం, గుజరాత్ సీఎం కాస్త దేశానికే ప్రధాని కావడం చకచకా జరిగిపోయాయి.అప్పటి నుంచి పేకే జోరు కొనసాగుతూనే ఉంది. ఆ వెంటనే 2015 బీహార్ ఎన్నికల్లో జేడీయూతో కలిసి పనిచేశారు. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎంగా నితీష్‌కుమార్ ప్రమాణం చేశారు. అనంతరం 2017లో పంజాబ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్, 2017యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పనిచేశారు. అయితే పంజాబ్‌లో కాంగ్రెస్ గెలవగా యూపీలో ఓడిపోయింది. కారణం అక్కడ 27 ఏండ్ల నుంచి కాంగ్రెస్ ఎన్నడూ అధికారంలోకి లేదు. అనంతరం 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం, 2020 ప్రస్తుత ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ విజయంలోకూడా పీకే భాగస్వామ్యం ఉందంటే అతిశయోక్తి కాదు. అంతేకాకుండా భవిష్యత్తులో తమిళనాడులో జరిగే ఎన్నికల్లో డీఎంకే పార్టీ కోసం పీకే పనిచేయనున్నారు. అందుకోసం 2020 ఫిబ్రవరి 3న ఆపార్టీ అధినేత స్టాలిన్‌తో ఒప్పందం కూడా చేసుకున్నారు. 2021లో పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ తరఫున పనిచేయాలని సీఎం మమతా బెనర్జీ కబురు పంపిందంటే అతని రాజకీయ వ్యుహానికి ఉన్న పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా ప్రశాంత్ కిషోర్ 2018 సెప్టెంబర్ 16న బీహార్ సీఎం నితిష్‌కుమార్ సారథ్యంలో జేడీయూలో చేరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏకు మద్దతుగా అతడు మాట్లాడాడని, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించాడని జేడీయూ పార్టీ 2020 జనవరి 29న పీకేను ఆ పార్టీ నుంచి బహిష్కరించింది.


Next Story

Most Viewed